నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఒకరు. మరొకరు విదేశాల్లో టీఆర్ఎస్ కార్యకలాపాలు, సామాజిక కార్యక్రమాలతో పాటు తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధికి సహకరిస్తున్న వ్యక్తి. వీరిద్దరూ నిజామాబాద్కు చెందిన గణేశ్ బిగాల, మహేశ్ బిగాల ‘బిగాల బ్రదర్స్’ గా అందరి మన్ననలు పొందుతూ మరోసారి తమ మెగా దాతృత్వాన్ని చాటుకున్నారు. తండ్రి బిగాల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం భవనానికి రూ. 25,51,116లను విరాళంగా అందజేశారు.
తమ తండ్రి పేరు చిరకాలం గుర్తుండే విడంగా ఆ భవనానికి ‘బిగాల కృష్ణ మూర్తి భవన్’ గా నామ కరణం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల మాట్లాడుతూ సుమారు కోటి 50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న పట్టణ ఆర్యవైశ్య సంఘం భవనానికి తమ వంతుగా విరాళాన్ని అందజేశామని అన్నారు.
‘తండ్రి జ్ఞాపకార్థం సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కరోనా సమయం లో రెండు దశల్లో భోజన వితరణ కార్యక్రమం నిర్వహించామ’ని వెల్లడించారు. తాత , తండ్రి జ్ఞాపకార్థం మాక్లూర్లో అధునాతన సదుపాయాలతో రూ. 5 కోట్ల 70 లక్షలతో స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. మాక్లూర్ గ్రామంలో అధునాతన స్మశాన వాటికను నిర్మించామని, విఠలేశ్వర మందిరాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
పట్టణ ఆర్య వైశ్య సంఘానికి రూ. 25 లక్షలు విరాళం అందించిన ఎమ్మెల్యే గణేశ్గుప్తాను, మహేష్ బిగాల గుప్తాను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడు ఉప్పాలంచ భూమా లింగం గుప్తా, ప్రధాన కార్యదర్శి గజావాడ హన్మంత్ రావు, కోశాధికారి కొవూరి జగన్ గుప్తా, నుడా డైరెక్టర్ మల్లేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.