మంచిర్యాల, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. చెన్నూర్ నియోజకవర్గంలో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించిన ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి బోడ జనార్దన్ సహా డాక్టర్ రాజారమేశ్ ఇద్దరూ ఒకే రోజు రాజీనామా చేశారు. ముందు నుంచి చెన్నూర్లో కాంగ్రెస్ జెండాను నిలబెట్టామని.. కానీ అధిష్ఠానం తమకు వెన్నుపోటు పొడిచిందని డాక్టర్ రాజారమేశ్ పేర్కొన్నారు.
టికెట్ ఇస్తామని నమ్మించి ఉన్న ఫలంగా ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన ప్యాపారవేత్తకు స్వాగతం పలకడంపై అసహనం వ్యక్తం చేశారు. ముందుగా చెన్నూర్ టికెట్పై హామీ ఇవ్వడం, వివేక్ చేరిన అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ స్థానంపై స్పష్టత రాకపోవడంతో ఆయన పార్టీ నుంచి వైదొలిగినట్టు తెలిసింది. ఈ మేరకు రాజీనామా లేఖను రేవంత్రెడ్డికి ఫ్యాక్స్ చేసినట్టు సమాచారం. కాగా మంగళవారం చెన్నూర్ సభలో బోడ జనార్దన్ బీఆర్ఎస్లో చేరనున్నట్టు సమాచారం.