యాదాద్రి భువనగిరి : పోలీసులు అంటే కర్కశంగా ఉంటారని చాలా మంది భావిస్తుంటారు. అయితే అందరూ అలాగే ఉండరని, మానవీయంగా కూడా స్పందిస్తారని కొన్ని కొన్ని సంఘటనలు రుజువు చేస్తుంటాయి. అలాంటి సంఘటనే భువనగిరి డీసీపీ కార్యాలయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే వృద్ధురాలు తన కొడుకులు అన్నం పెట్టడం లేదని తన గోడును వెళ్లబోసుకునేందుకు భువనగిరి డీసీపీ కార్యాలయానికి వచ్చింది.
నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న ఆ పండుటాకు పట్ల డీసీపీ కార్యాలయ సిబ్బంది ఔదార్యం చూపారు. కార్యాలయం పైకి రావడానికి ఇబ్బంది పడుతుండడంతో గమనించిన కార్యాలయ సిబ్బంది, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రమేష్ ఆ వృద్ధురాలికి చెయ్యి అందించి జాగ్రత్తగా తీసుకుని కార్యాలయంలోకి తీసుకొచ్చారు. ఆ వృద్ధురాలు తన బాధను డీసీపీ నారాయణ రెడ్డికి విన్నవించింది. ఆయన వెంటనే స్పందించి ఆ ముగ్గురు కొడుకులను పిలిపించి సమస్యను పరిష్కరించమని ఎస్ఐ మధు బాబును ఆదేశించారు.
తిరిగి ఆ వృద్ధురాలిని కిందికి తీసుకువెళ్లి కార్యాలయ సిబ్బంది భద్రంగా ఆటో ఎక్కించి పంపించారు. ఆపదలో ఉన్న వృద్ధురాలిపట్ల మానవీయంగా స్పందించిన పోలీసు సిబ్బంది పట్ల ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
డీఆర్ కాంగోలో మిలిటెంట్ల దాడి.. 30 మంది మృతి
Ind vs Eng | ఇంగ్లండ్ గెలుస్తుందా? చేజింగ్లో ఆ టీమ్ రికార్డేంటి? ఓవల్ పిచ్ ఎలా ఉంది?
తలలు అతుక్కొని పుట్టిన కవలలకు విజయవంతంగా సర్జరీ.. ఎప్పుడు? ఎక్కడ?