Congress | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : యాదగిరిగుట్ట చిన్నపీట వివాదం పైకి సమసిపోయినట్టుగా కనిపిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గతంగా మరింత ముదురుతున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఉదంతాన్ని పార్టీ అధిష్ఠానం తొలుత లైట్గా తీసుకున్నప్పటికీ, చిన్నపీట ఇష్యూ ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు ఫిర్యాదులు అందడంతో ఆ విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్గా తీసుకున్నట్టు సమాచారం. ప్రధానమంత్రి మోదీ స్వయంగా ఈ అంశాన్ని తన ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవడం దీనికి మరింత ఆజ్యం పోసినట్టు అయ్యిందని చెప్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలిసి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుకలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, ఆయన సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు పెద్దపీట వేసి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సామాజిక వర్గానికి చెందిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను అవమానపరిచేవిధంగా చిన్నపీట వేసి కూర్చోబెట్టడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రకమైన కులవివక్షపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి పెద్దమరకగా మిగిలే ప్రమాదం ఉండటంతో ఆ మరునాడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా స్పందించి నష్టనివారణకు యత్నించారు. ఈ ఘటనపై తన సన్నిహితుల వద్ద భట్టి విక్రమార్క కుతకుతలాడినప్పటికీ, బయటికి మాత్రం దీనిని టీకప్పులో తుఫానుగా కొట్టిపారేస్తూ వివాదం సమిసిపోయిందన్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ పార్టీ అంతర్గత వేదికలపై మాత్రం తనకు జరిగిన అవమానం కాకతాళీయంగా జరిగింది కాదని, ఉద్దేశపూర్వకమేనని భట్టి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. పార్టీ పెద్దలు మల్లికార్జునఖర్గే, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ దృష్టికి తన కుటుంబ సభ్యుల ద్వారా లిఖితపూర్వకంగా తీసికెళ్లి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా పార్లమెంట్ అభ్యర్థుల ఖరారుపై ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశానికి వెళ్లిన సీఎం రేవంత్రెడ్డిని పార్టీ అగ్రనాయకులు ఈ అంశంపై ఆరా తీసారంటే.. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ వివాదాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నదో తెలుస్తున్నది.
రాష్ట్ర గవర్నర్గా రాధాకృష్ణన్ బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనతో రాజ్భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్పాటు మంత్రులంతా హాజరైనప్పటికీ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గైర్హాజర్ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో తనకు ఎదురైన అవమానాల వల్లనే ఆయన గైర్హాజర్ అయ్యాండాన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే భట్టి విక్రమార్క సన్నిహితులేమో ‘అలాంటిదేమీ లేదు.. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశానికి వెళ్లిన భట్టి అక్కడే ఉండిపోవడం వల్ల రాలేకపోయారు’ అని చెప్తున్నారు. ఎన్నికల కమిటీ సమావేశం తిరిగి గురువారం ఉండటం వల్ల ఢిల్లీలోనే ఉండిపోయారని అంటున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, ఎన్నికల కమిటీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా హాజరు కావాల్సి ఉన్నది. అయినప్పటికీ వారు గవర్నర్ ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం భట్టి ఎందుకు రాలేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం ఎంపీ టికెట్ భట్టి తన భార్యకు ఇప్పించుకునేందుకు లాబీయింగ్ చేయడంలో బిజీగా ఉండటం వల్లనే గవర్నర్ ప్రమాణానికి రాకపోవడానికి కారణంగా కాంగ్రెస్లోని ఒకవర్గం నాయకులు చెబుతున్నప్పటికీ.. అది నిజం కాకపోవచ్చునని మరికొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఒకవైపు ప్రభుత్వ ప్రకటనలలో సీఎం రేవంత్రెడ్డి ఫొటో ఒక్కటే ముద్రించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అప్పటికే గుర్రుగా ఉన్నారు. దీనికి యాదగిరిగుట్టలో చిన్నపీట వివాదం అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటినుంచే పార్టీలో ఆయన ఆధిపత్య ధోరణి సీనియర్ నేతలను నొచ్చుకునేలా చేసింది. అయితే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో వారంతా ఆయనకు సహకరిస్తూ వచ్చారు. అనూహ్యంగా పార్టీ అధికారంలోకి రావడంతో.. అధిష్ఠానం భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వంటి సీనియర్లను ఒప్పించి సీఎం సీట్లో రేవంత్ను కూర్చోబెట్టింది. అయినప్పటికీ సీనియర్లు సర్దుకుపోయే ప్రయత్నం చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తన పాదయాత్రనే దోహదం చేసిందని భట్టి విక్రమార్క అనేక సందర్భాలలో, పార్టీ అంతర్గత వేదికలపై గుర్తుచేస్తూనే ఉన్నారు. సీఎం సీట్లో కూర్చోవాల్సిన తాను డిప్యూటీ సీఎం పోస్టుతో సరిపెట్టుకున్నప్పటికీ.. తనను అవమానించేలా, తన స్థాయిని తగ్గించేలా తనపట్ల చులకనభావాన్ని ప్రదర్శిస్తున్నారని భట్టి విక్రమార్క సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం.