Telangana Budget | హైదరాబాద్ : రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. రైతుబంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు.
అదే విధంగా ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల భీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామని తెలిపారు. రైతుబీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని చెప్పారు.
నాసిరకం విత్తనాలను, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారినీ కూడా తమ ప్రభుత్వం ఉపేక్షించదు. నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.