సూర్యాపేట, జూన్ 25 (నమస్తే తెలంగాణ): సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదివారం సూర్యాపేటలో చేపట్టిన పాదయాత్రలో కాంగ్రెస్ నాయకుల వర్గపోరు మరోమారు బహిర్గతమైంది. పాదయాత్ర సందర్భంగా రాంరెడ్డి దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోపులాటకు దిగగా పలువురి దుస్తులు చిరిగిపోయాయి. రెండు వర్గాల మధ్య పదేపదే ఉద్రిక్తతలు చోటు చేసుకుంటుండటంతో స్పందించిన భట్టి.. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదంటూ తనకు రెండు పక్కలా ఇద్దరిని పెట్టుకొని పాదయాత్ర కొనసాగించారు. పట్టణంలోని శంకర్విలాస్ సెంటర్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగులో దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి వర్గీయులు రెండు పక్కల వేర్వేరుగా నిలబడి పోటాపోటీగా నినాదాలు చేయడంతో నేతల ప్రసంగాలకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి.