కరీంనగర్ : పద్మశ్రీ భాష్యం విజయ సారథి సాహిత్యాన్ని బాహ్య ప్రపంచానికి అందించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆయన రాసిన పుస్తకాలను చిరస్థాయిగా నిలిచిపోయేలా జిల్లా గ్రంథాలయంలో ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కరీంనగర్ లోని యజ్ఞ వరాహ స్వామి దేవస్థానంలో నిర్వహించిన భాష్యం విజయ సారథి సంస్మరణ సభలో మంత్రి మాట్లాడారు.
దేశం, ధర్మం కోసం ఆలోచించే భాష్యం లేని లోటు రాష్ట్రానికి, జిల్లాకు తీరని లోటని అన్నారు. వ్యక్తిగతంగా తానేంతో కోల్పోయనని అన్నారు. భాష్యం విజయ సారథితో సమాలోచనలు చేయనిదే తాను ఏ కార్యక్రమం చేపట్టలేదని అన్నారు. సంస్కృతం లో పద్మశ్రీ అందుకొని జిల్లాకు కీర్తి, ప్రతిష్టలను తీసుకువచ్చారని, ఆయన ఆలోచనలు, ఆశయాలను భావితరాలకు అందించటానికి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఆయన గౌరవార్థం ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో నిర్మించే అమృత వర్షిణి (కళాభారతి) పేరును భాష్యం విజయ సారథి కళా వేదికగా పేరు మార్పు చేయనున్నట్లు తెలిపారు. కళా వేదిక ముందు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
భాష్యం ఆలోచనలను పంచుకుంటాం : బోయినపల్లి వినోద్ కుమార్
భాష్యం విజయ సారథి మరణం తీరని లోటని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆయన రచించిన పుస్తకాలను తాను ఎంపీగా ఆవిష్కరించడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. సంస్కృత భాషపై ప్రస్తుతం కొంత మంది కే అవగాహన ఉండడం దురదృష్టకరమని అన్నారు. సంస్కృత విశ్వ విద్యాలయం కోసం పార్లమెంటులో పోరాటం చేశానని గుర్తు చేశారు. భాష్యం విజయ సారథి ఆలోచనలు, సందేశాలను పాటించడమే తమ వంతు కర్తవ్యంగా భావిస్తామని వెల్లడించారు.