Tellam Venakta Rao | ఖమ్మం, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తాను పార్టీ మారడం లేదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్త వం లేదని తేల్చిచెప్పారు. తాను రేవంత్రెడ్డితో ఉన్న పాత ఫొటోను కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో వస్తున్నదంతా అబద్ధమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని తేల్చిచెప్పారు. సోమవారం ఆయన ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మా ట్లాడారు. తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.
ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే త నను గెలిపించినట్టు స్పష్టం చేశారు. ఏజెన్సీలో ఉన్న ప్ర ధానమైన పోడుభూముల పట్టాల సమస్యను కేసీఆరే తీర్చారని గుర్తుచేశారు. రైతుబంధు సహా అనేక పథకాలను అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. పార్టీ అధినేత కేసీఆర్ పట్ల విశ్వాసంగా ఉంటానని, జీవి తం ఉన్న వరకు తాను కేసీఆర్తోనే నడుస్తానని స్పష్టం చేశారు. గిట్టనివారు ఉద్దేశపూర్వకంగా తనపై చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు రేవంత్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులతో దిగిన ఫొటోను ఇప్పుడు కొంతమంది గిట్టని వారు ఉద్దేశపూర్వకంగానే వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే ఏసీపీకి సైతం ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.