భద్రాచలం/సారపాక : నాలుగేండ్లుగా భద్రాచలం, సారపాక పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో ప్రభుత్వం వాటిని మున్సిపాలిటీలుగా మార్చుతుందనే ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటికీ పుల్స్టాప్ పెడుతూ భద్రాచలం పంచాయతీని మూడు పంచాయతీలుగా, సారపాకను రెండు పంచాయతీలుగా ప్రకటిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
భద్రాచలం పంచాయతీ పరిధిలో 70 వేల జనాభా ఉండగా 30వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. సారపాక పంచాయతీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 20,164 జనాభా ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 30 వేలకు చేరుకున్నట్లు ఓ అంచనా. ఓటర్లు 21 వేల మందికి పైగా ఉంటారని సమాచారం.
నిన్నటి వరకు ఒకే పంచాయతీగా ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఉత్తర్వులతో మూడు పంచాయతీలుగా మారింది. భద్రాచలం ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ కేంద్రం. తాజా ఉత్తర్వులతో భద్రాచలం రెవెన్యూ విలేజ్లో భద్రాచలం, సీతారామనగర్, శాంతినగర్ పంచాయతీలుగా మారాయి. భద్రాచలం పంచాయతీ పరిధిలో 21 వార్డులు, సీతారాంనగర్ లో 17 వార్డులు, శాంతినగర్ పంచాయతీ పరిధిలో 17 వార్డులు ఉంటాయి.
పారిశ్రామిక వాడగా పేరు గాంచిన సారపాక ఇకపై సారపాక, ఐటీసీ పంచాయతీలుగా మారింది. సారపాక పంచాయతీ పరిధిలో 17 వార్డులు, ఐటీసీ పంచాయతీలో 15 వార్డులతో ఏర్పాటు కానున్నది. సారపాక మున్సిపాలిటీ అవుతుందని భావించిన తరుణంలో ఇటీవల ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పంచాయతీ అవుతుందని ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో భద్రాచలం, సారపాక మున్సిపాలిటీ అంశానికి తెరపడినట్లయింది.