భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్యపై ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అసమ్మతి గళం వినిపించారు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యేకు పట్టింపు లేకపోవడం, తనకు నచ్చిన వారిని పెంచి పోషిస్తూ వాళ్లతో గ్రూపులు కట్టడంపై ఆ పార్టీ నేతలు గతంలోనే అనేకసార్లు బహిరంగ ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలకు విసిగి వేసారి మూకుమ్మడిగా బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకునానరు. శుక్రవారం ఈమేరకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మానుకోట ఎంపీ కవిత, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చర్ల, వాజేడు ఎంపీపీలు కోదండరామయ్య, చిన్నారావు, వివిధ పంచాయతీల సర్పంచ్లు వర్సా చిన్నారావు, గుండు వెంకటేశ్వర్లు, సరియం సీతారాములు, మడకం నాగేంద్రబాబు, ఎంపీటీసీలు పూసం ధర్మరాజు, సోడి తిరుపతిరావు, మడకం రామారావు, నాయకులు గూడపాటి సతీశ్, తాండ్ర వెంకటరమణ, తాళ్లపల్లి రమేష్ గౌడ్, బొలిశెట్టి రంగారావు, తాండ్ర నరసింహారావు, తెల్లం నరేశ్, పూర్ణ చంద్రరావు, గండిపల్లి హనుమంతరావు, బండారు సుధాకర్, ఉబ్బా వేణు ఉన్నారు.