హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. సేవలను మారుమూల ప్రాంతాల్లోనూ పటిష్టంగా అందజేస్తున్నది. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కొవిడ్ కేంద్రాలను ఏర్పాటుచేసి ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచింది. డయాబెటిక్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టిసారించి అవసరమైన మందులను పంపిణీ చేస్తున్నది. ఇంటింటి సర్వే ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనాను అరికట్టడంలో విజయవంతమైంది. మరోవైపు తీవ్రపోషకాహారలోపంతో బాధపడుతున్న 13 వేల మందిని గుర్తించి వారికి గిరిపోషణ్ పథకం కింద పౌష్టికాహారం అందిస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఆరేండ్లలోపు వయస్సున్న పిల్లలతోపాటు బాలింతలు, గర్భిణులపై గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక దృష్టిసారించింది.
51 కొవిడ్ కేర్కేంద్రాలు
గిరిజన ప్రాంతాల్లో ఇంటింటి సర్వేద్వారా కరోనాను అరికట్టడంలో విజయవంతమైన ప్రభుత్వం.. ముందస్తు చర్యగా కొవిడ్ కేర్ సెంటర్లను అందుబాటులో ఉంచింది. ఆయా ప్రాంతాల్లోని గురుకుల విద్యాలయాలు, వసతిగృహాలు, దవాఖానలను కొవిడ్ కేర్కేంద్రాలుగా మార్చింది. మొత్తం 51 కొవిడ్కేంద్రాల్లో సుమారు 5 వేల బెడ్లను ఏర్పాటుచేసింది. ఏజెన్సీ ప్రాంతం మహబూబాబాద్ జిల్లాలోని గార్లలో 20 ఆక్సిజన్, పది అబ్జర్వేషన్ బెడ్లు ఏర్పాటుచేసి గిరిపుత్రుల ఆరోగ్యానికి భరోసానిచ్చింది.
‘గిరిపోషణ్’తో సంపూర్ణ ఆరోగ్యానికి రక్ష
గిరిజనుల్లో నాలుగు తెగలు తీవ్ర పౌష్టికాహారలోపంతో సతమతమవుతున్నాయని జాతీయసంస్థలు నిర్వహించిన సర్వేలు వెల్లడించాయి. ఈ తెగల సంపూర్ణ ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ‘గిరిపోషణ్’ కార్యక్రమం కింద ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. కొలామ్, కొండరెడ్డి, థోటీ, చెంచు ఈ నాలుగు తెగలున్న ఆసిఫాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్ జిల్లాల్లో సర్వే నిర్వహించింది. మొత్తం 533 ఆవాసాల్లో ఉన్న దాదాపు 80 వేల మంది జనాభా ఉన్నట్టు గుర్తించింది. గర్భిణులు, బాలింతలు, 3-6 ఏండ్ల వ వయస్సున్నవారు 12వేల మంది ఉన్నట్టు నిర్దారించింది. ఎత్తు, ఎత్తుకు తగిన బరువు, చిన్నపిల్లల్లో ఎత్తు, బరువుతోపాటు జబ్బచుట్టుకొలత వంటివి ప్రామాణికంగా తీసుకొని ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారంతోపాటు.. గిరిజన్ పోషణ్ కింద అదనంగా ఆహారం అందజేస్తున్నది. పట్టణాలు, నగరాల్లోని మైదానప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎటువంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయో అదేరీతిలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు అందాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం అన్నిచర్యలు చేపట్టింది.