హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని, అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని, కానీ 120 రోజుల పాలనలోనే నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నదని, తమని నట్టేట ముంచిన కాంగ్రెస్కు నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. శుక్రవారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ మోసాలపై కేటీఆర్ స్పందించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రియాంకగాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు హామీ ఇచ్చారని, కానీ ఆ హామీనే ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార మాట మార్చారని గుర్తుచేశారు. ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్ను ప్రకటన ఇచ్చిందని, వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీచేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటున్నదని ధ్వజమెత్తారు. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి.. టెట్ పరీక్ష ఫీజును రూ.400 నుంచి రూ.2 వేలకు పెంచిందని విమర్శించారు. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులు ఎన్నో కోర్టు కేసులు వేసి అనేక పోటీ పరీక్షలు రద్దవటానికి కారణమయ్యారని మండిపడ్డారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నారని, ఉద్యోగార్థులను మాత్రం కాంగ్రెస్ దికుతోచని స్థితిలో వదిలేసిందని దుయ్యబట్టారు.