హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఉద్యోగులకు వంద రోజుల్లో రూ.6 వేల కోట్ల బెనిఫిట్స్ ఇస్తామన్న మాట ఉత్తిదేనా? ఇది కూడా ఆరు గ్యారెంటీలు, 420 హామీల మాదిరిగా గాలిలో కలిసిపోవాల్సిందేనా? మూడు నెలల్లో అంత డబ్బు సర్దుబాటు చేయలేనని ఆర్థిక శాఖ మంత్రి అడ్డం తిరిగారా? అందుకే మంత్రుల వేతనాల్లో 50శాతం కోత అంటూ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపబోతున్నదా? ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది.
దీనికి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి ఇటీవలే ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్తూనే, ఉద్యోగ విరమణ బకాయిల చెల్లింపు కోసం రాబోయే 100 రోజుల్లో రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త పీఆర్సీపై తక్షణమే నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించామని, ఆ నివేదిక ఆధారంగానే తదుపరి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 100 రోజుల్లో రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి హామీపై ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. మూడు నెలల్లో అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామని ఎదురు ప్రశ్నించినట్టు చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని, వాటి చెల్లింపులకే నిధుల్లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారట.
రైతులకు ఇంకా రెండు విడుతల రైతు భరోసా నిధులు పెండింగ్లో ఉన్నాయని, ఖరీఫ్ సీజన్ కూడా దగ్గరికి వచ్చిందని, వానకాలం రైతుభరోసా ఇవ్వకపోతే అన్నదాతల ఆగ్రహాన్ని తట్టుకోలేమని అన్నట్టు సమాచారం. వానకాలం వరకు గ్రామ పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్కైనా నిధులివ్వకపోతే ఇబ్బందులు పడుతామని చెప్పారట. వీటన్నింటినీ వదిలేసి రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేమని భట్టి తేల్చి చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ.5 వేల కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.6,200 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని చెప్పారట. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లిస్తే వెంటనే రెగ్యులర్ ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం పోరాటం మొదలు పెడుతారని, సమ్మెలు, ధర్నాలు అంటారని భట్టి ఈ భేటీలో వివరించినట్టు తెలిసింది.
నిధుల విడుదల సాధ్యంకాదని భట్టి విక్రమార్క తేల్చిచెప్పిన నేపథ్యంలో రిసోర్స్ మొబిలైజేషన్ సబ్కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల బాధ్యులను మరోసారి చర్చలకు పిలిచి మాట్లాడాలని సీఎం సూచించినట్టు తెలిసింది. వారిని తాత్కాలికంగా చల్లబరిచేందుకు మంత్రులకు ఇచ్చే వేతనాల్లో 50 శాతం కోత విధించాలనే నాటకానికి తెరలేపాలని నిర్ణయించారట.
వాటిని రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్కు వినియోగిస్తామని, తద్వారా తమకు సాధ్యమైన అన్నిమార్గాల్లో చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నామని సంఘాల నేతలకు చెప్పాలని అనుకుంటున్నట్టు సమాచారం. రాష్ట్ర మంత్రులకు నెలనెలా రూ.4.5 లక్షల చొప్పున వేతనం, అలవెన్స్లు అందుతాయి. ఇందులో 50 శాతం అంటే రూ.2.25 లక్షల చొప్పున కోత పెట్టాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రితో కలిపి రాష్ట్రంలో 15 మంది మంత్రులు ఉన్నారు. వీళ్ల జీతంలో కోతపెడితే నెలకు రూ.33.75 లక్షలు మిగులుతాయి. మూడు నెలలకు కలిపితే రూ.కోటి మాత్రమే అవుతాయి. ఈ రూ.కోటితో రూ.6,200 కోట్లకు ముడిపెట్టి ఎలా నాటకం నడిపిస్తారని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు.