Palamuru Rangareddy Lift Irrigation | (గుండాల కృష్ణ) హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా.. కృష్ణా బేసిన్లో 95 శాతం విస్తరించి ఉన్నా ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు నోచుకోని ప్రాంతమిది. 14 లక్షల ఎకరాల సాగుయోగ్య భూమి ఉన్నా.. చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టులే దిక్కు తప్ప ఒక్క మేజర్ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. హైదరాబాద్ తాగునీటి కోసం ఈ జిల్లా మీదుగానే కృష్ణాజలాలను తరలించారు.. కానీ సాగునీటి విషయానికొచ్చేసరికి ఎలాంటి పొంతనలేని ప్రాణహితజలాలతో ముడిపెట్టారు. తెలంగాణ గడ్డ మీద కృష్ణాజలాల వినియోగం ఉండొద్దనే సమైక్య కుట్రల్లో తెలంగాణ నష్టపోతే.. రంగారెడ్డి జిల్లా పూర్తిస్థాయిలో భారీ ప్రాజెక్టులకు దూరమైంది. అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తొలి ప్రాధాన్యంగా శంకుస్థాపన చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పుడు రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలంగా మార్చనున్నది. ఏకంగా ఆరు లక్షల పైచిలుకు ఎకరాలను తడిని అందించి, 350 గ్రామాల దాహార్తిని సైతం తీర్చేలా ఈ ప్రాజెక్టు డిజైన్ రూపొందించారు.
95 శాతం కృష్ణా బేసిన్లో ఉన్న రంగారెడ్డి జిల్లా భూములు.. కేవలం 5 శాతం మాత్రమే గోదావరి బేసిన్లో ఉన్నాయి. అయినా పట్టుమని పది టీఎంసీల నిల్వ చేసే ప్రాజెక్టు ఇక్కడ లేదు. మధ్యతరహా ప్రాజెక్టు కోట్పల్లి, లక్నాపూర్, జంటుపల్లి వంటి చిన్న తరహా ప్రాజెక్టుతోపాటు కాకతీయుల కాలంలో నిర్మించిన సుమారు 2,450 చెరువులే సాగుకు ఆధారం. ఇబ్రహీంపట్నం చెరువు వంటివి కూడా సమైక్య రాష్ట్రంలో ఎడారులను తలపించాయి. నాటి పాలకులు ఈ జిల్లా భూములను ఆర్థిక వనరులుగా మలుచుకున్నారే తప్ప సాగు భూములకు చుక్క సాగునీటినైనా అందించాలనే చొరవ చూపలేదు.
కృష్ణా బేసిన్లో 95 శాతం ఉన్న రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి పొంతనలేని ప్రాణహిత నుంచి సాగునీరు అందించాలనే కుట్రపూరిత ప్రాజెక్టుకు ఉమ్మడి పాలకులు రూపకల్పన చేశారు. ఆ ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-23, 24, 25, 26 కింద ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పనులు రూపొందించారు. రూ.4,200 కోట్ల విలువైన ఈ ప్యాకేజీకి టెండర్లు పూర్తి చేసి, మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించారు. ప్రాణహిత దగ్గర బరాజ్ లేకుండానే తోక అయిన చేవెళ్ల ప్రాంతంలో పనులు మొదలుపెట్టారు. రూ.194 కోట్ల చెల్లింపులు కూడా జరిగిపోయాయి. కానీ పనికొచ్చే పని జరిగింది లేదు.
తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాలో క్రమక్రమంగా వ్యవసాయం మళ్లీ జీవం పోసుకొన్నది. దశాబ్దాలపాటు వరద జాడ తెలియని ఇబ్రహీంపట్నం చెరువు వంటి నీటి వనరులు ఇప్పుడు జలకళతో బీడు భూములను పచ్చగా మార్చేశాయి. మిషన్ కాకతీయ కారణంగా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఉమ్మడి రంగారెడ్డి ముఖచిత్రమే మారిపోనున్నది.
కృష్ణా బేసిన్ 95 శాతం
గోదావరి బేసిన్ 5 శాతం
ప్రస్తుతం సాగుకు యోగ్యమైన భూమి – 14 లక్షల ఎకరాలు
జిల్లాలో ఇప్పటివరకు ఉన్న అతి పెద్ద ప్రాజెక్టు కోట్పల్లి వాగు (మధ్యతరహా ప్రాజెక్టు – ఆయకట్టు 9,200 ఎకరాలు)
చెరువులు 2,450
తెలంగాణ ఏర్పాటు నాటికి సాగవుతున్న భూమి – దాదాపు లక్ష ఎకరాలు
మిషన్ కాకతీయతో చెరువులకు పునర్జీవం రావడంతో సాగు విస్తీర్ణం పెరిగింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆరు లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు
దాదాపు 350 గ్రామాలకు తాగునీరు