పెద్దపల్లి, మార్చి 14: పెద్దపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కేటాయించిన ఇండ్లను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ, గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. ‘పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం.. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం’ అని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేదోడి సొంతంటి కలను కలగానే మార్చే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో చందపల్లి, కునారం రోడ్లో 484 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి రిజర్వేషన్ ప్రాతిపదికన లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి, ఎంపికైన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
రెక్కాడితే గానీ డొక్క నిండని పరిస్థితి తమదని, కిరాయి కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ నెల 11న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తే మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. గడువు ముగిసినా ఇండ్లు అప్పగించకపోవడంతో కలెక్టర్ను కలువడానికి వస్తే కలెక్టర్ లేరని అకారులు చెబుతున్నారని వాపోయారు. తమ గోడు చెప్పుకుందామంటే ఇటు ఎమ్మెల్యే కలుస్తలేడు.. అటు కలెక్టర్ కలుస్తులేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై లక్ష్మణ్రావు సముదాయించినా వినలేదు. ఎస్సై చొరవ తీసుకొని ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్తో ఫోన్లో లబ్ధిదారులతో మాట్లాడించారు. నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు రాస్తారోకో విరమించారు.