సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బీసీ సంఘాల వినతి
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వెనుకబడిన వర్గాలలకు న్యాయం జరిగేలా చూడాలని బీసీ సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల బీసీ సంఘాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్, కేసన శంకర్రావు ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం మంగళవారం న్యూఢిల్లీలోని ప్రధాన న్యాయమూర్తి నివాసంలో జస్టిస్ ఎన్వీ రమణను కలిసి వినతిపపత్రం అందజేసింది. న్యాయముర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతోపాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని వారు కోరారు. ప్రస్తుతం దేశంలో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్ను ఎత్తివేసి జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు కృషి చేయాలని వేడుకున్నారు. సీజేఐని కలిసినవారిలో రాచాల యుగేందర్గౌడ్, కుమ్మరి క్రాంతికుమార్, కులచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్గౌడ్, కనకాల శ్యామ్, రావులకోల్ నరేశ్, ఈడిగ శ్రీనివాస్గౌడ్, పరుసా రంగనాథ్, పానుగంటి విజయ్, సాయితేజ తదితరులున్నారు.