బీసీ కమిషన్ సభ్యులు కిశోర్, ఉపేంద్ర
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): బడుగుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్ర కొనియాడారు. ప్రస్తుతం ఉన్న బీసీ గురుకులాలను విడతలవారీగా రెట్టింపు చేయాలని సీఎం నిర్ణయించటంపై హర్షం వ్యక్తం చేశారు. దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని, జిల్లాకు ఒకటి చొప్పున 33 బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం జిల్లాకు నాలుగు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 132 స్టడీ సరిళ్లను ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు, యువత తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
బీసీ సంక్షేమ సంఘం హర్షం
బీసీ గురుకులాలు, కాలేజీల సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయంపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విద్యాసంవత్సరం మొదటి విడతగా అమ్మాయిల కోసం 15 డిగ్రీ గురుకులాలు, వచ్చే సంవత్సరం 17 బీసీ డిగ్రీ గురుకులాలను మంజూరు చేయటం మంచి పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. అందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.