హైదరాబాద్, సెప్టెంబర్22 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకోసం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బడుగుల లింగయ్యయాదవ్ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆగమేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్రం, బీసీలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం 30 ఏండ్లుగా పోరాడుతున్నా పాలకులు పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లతోపాటు కులగణన చేపట్టాలని, కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటే చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం కన్వీనర్ గుజ్జు కృష్ణ, డాక్టర్ ఎన్ మారేశ్, బీద మస్తాన్రావు తదితరులు పాల్గొన్నారు.