‘పోరాడి పోరాడి అలసిపోయినం. ఏలెటోడు కరుణించడు. మనకు నీళ్లు రావు. మన బతుకు ఇంతే అనుకున్నం. ఇట్ల కేసీఆర్ వస్తడని, తెలంగాణ తెస్తడని అనుకోలే. నీళ్లొస్తయన్న ఆశలొదులుకున్నం. కేసీఆర్ రూపంలో కాలం కలిసొచ్చింది. శివన్నగూడెం ప్రాజెక్టుకు పునాది పడ్డది. మా మనాది పోయింది. ప్రాజెక్టు పూర్తి కాకమునుపే.. ఉన్న కొద్దిపాటి నీళ్లకే రెండు పంటలు పండుతున్నయ్.
పశువుల గడ్డి కోసం ఆంధ్రాకి పోయినోళ్లం.. మేమే వరి పండిస్తమనుకోలె!. ఎంత మారింది మా బతుకు. మా చేల పండితే బంగారం. అమ్మితే ఎకరం కోట్లే!’ అంటున్నరు శివన్నగూడెం ప్రాజెక్ట్ నీళ్లు పారే దిగువ ప్రాంత రైతులు. ఈ ఆనకట్ట నిర్మాణం రోజుకో అడుగు ఎత్తు పెరుగుతున్నట్టే మా ఊళ్లల ఎవుసం చుట్టూ అభివృద్ధి మునుముందుకు సాగుతున్నదంటున్నరు అక్కడి రైతులు.
శివన్నగూడెం ఆనకట్ట నిర్మాణం
నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: నల్లగొండ పల్లెల్లో ఇప్పుడు ఎక్కడలేని సంబురం. మూడు తరాలను బలిగొన్న ఫ్లోరైడ్ విషపు నీళ్ల నుంచి ఈ పల్లెలకు విముక్తి కల్పించే శివన్నగూడెం ప్రాజెక్ట్ చకచకా కడుతున్నరు. దశాబ్దాల కరువుకి, వలస బతుకుకి చిరునామాగా నిలిచిన నల్లగొండ జిల్లాని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో శివన్నగూడెం ప్రాజెక్ట్ మొదలైంది. ఒకప్పుడు ఈ సాగునీటి చుట్టే ఇక్కడి ఎన్నికల రాజకీయం నడిచేది. ఇప్పటి ఎన్నికల ఈ నీళ్ల ముచ్చటేమిటో చూద్దామని ‘నమస్తే తెలంగాణ’ శివన్నగూడెం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న మర్రిగూడెం మండలంతోపాటు ఇతర మండలాల్లోని రైతుల్ని పలుకరించింది. 80 అడుగుల ఎత్తుండే ప్రాజెక్ట్ ఆనకట్ట ఇప్పటికే 60 అడుగుల దాకా పూర్తయింది. అందులో కొంత నీరు నిలిచింది. ఈ నీటితో ఆనకట్టకు ఇబ్బందిలేకుండా సిమెంటు గూనల్లోంచి రోజూ కొద్దిగా నీళ్లను కిందికి వదులుతున్నరు.
ఆ నీళ్లు పారే కాలువ పొంటే మందడి ప్రభాకర్రెడ్డి పత్తి చేను పచ్చగున్నది. ఎట్లున్నది ఎవుసం? అని పలుకరిస్తే.. ‘ఒకప్పుడు నీళ్లు లేక మెట్ట పంట పండించుడే కష్టమయ్యేది. మా చెర్లగూడెం చెరువు నిండితే 20 కిలోమీటర్లు కాలు వ పారేది. బంగారం లెక్క పంటలు పండేది. ఏండ్లపాటు వానలు పడక, చెరువు నిండక అరిగోస పడ్డం. పశువులకు గడ్డి కోసం మా నాయిన మిర్యాలగూడెం, ఆంధ్రాదాక పోయే ది. తెలంగాణ వచ్చినంక శివన్నగూడెం ప్రాజెక్ట్ మొదలువెట్టిన్రు. ప్రాజెక్టులో నిలుస్తున్న నీటితో మూడేండ్ల నుంచి చెరువు నిండుతాంది. ఆం ధ్రా నుంచి వరిగడ్డి కొనుక్కునుడు బంద్ చేసి నం. ఈడనే వరి పండిస్తున్నమంటే నమ్మలేకపోతున్నం. ఊహించనంతగా మారిపోయింది మా ఊరు. ఇప్పుడే ఇట్లుంటే.. ఇగ శివన్నగూడెం ప్రాజెక్ట్ అయినంక ఇంకెంత బాగుంటదో!?’ అని సంబురంగా చెప్తున్నాడు. అతనే కాదు.. ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ఇందుర్తి రెవెన్యూలో భూములున్న రైతులందరూ అలానే చెప్తున్నరు.
పెట్టుబడికి అప్పులు జెయ్యట్లే..
‘తెలంగాణ వచ్చినా బతుకు మారలేదంటున్నరు కొన్ని పార్టీల లీడర్లు. నిజమేనా?’ అని గ్రామానికి చెందిన పాలం దశరథని అడిగితే.. ‘ఎవుడాడంది? బుద్ధిలేని ఎదవ. అన్నం తినేటోడు అనేమాటేనా. వానికి కండ్లు కనవడకుండెనా? ఒకప్పుడు చానా బాధలు పడ్డం. చౌట నీళ్లుతాగితే పొద్దుందాంక ఎండసొడకొచ్చేది. కాళ్లు వంకర్లు, ఒళ్లు నొప్పులు. ఎన్ని బాధలో. ఇప్పుడే మంచిగున్నది. ప్రాజెక్టులు కడుతున్నరు. మంచి నీళ్ల కోసం భగీరథ వెట్టిండ్రు. పింఛెనిస్తుండు. రైతు బంధు ఇస్తుండు. ఫ్రీ కరెంటు ఇస్తుండు. పెండ్లికి పైసలిస్తండు. పుట్టిన పిలగాండ్లకు గూడ మంచి జేస్తుండె. నాకు మూడెకరాలకు రైతు బంధు ఇచ్చిండు. ఈ పైసల్తోని విత్తనాలు, ఎరువులు కొన్న. ఎవుసం జేసినం. అప్పు జెయ్యకుండ, మిత్తి బాధల్లేకుండ బతుకుతున్న. అన్నం తినేవాడు అబద్ధం చెప్పడు. అన్నం పెట్టే రైతు అబద్దం చెప్తడా?’ అంటున్నడు. నిజమే కదా?.
భూముల ధరలకు రెక్కలు
పంట పండితే పల్లె బాగువడ్డట్టే. పల్లే కాదు దేశమే బాగుపడుతది. మరి పల్లెలో ఎవుసం చుట్టూ ఉండే అభివృద్ధి ఎట్లున్నదో చెప్తున్నడు రైతు అయితవోని యాదయ్య. కల్లుగీత కార్మికుడైన యాదయ్యకు ఆసరా పింఛన్, తనకున్న 4.20 ఎకరాల భూమికి ఏటా రూ.50 వేలు రైతుబంధు వస్తున్నదని అంటున్నడు. నీళ్లు చేసిన మేలెంత గొప్పగున్నదో, భూముల ధరలెట్ల పెరిగినయో గూడ చెప్తున్నడు. శివన్నగూడెం కట్టక ముందు (మూడేండ్ల క్రితం వరకు) మా ఊళ్లె కచ్చా రోడ్డు పక్కన ఉన్న పొలం ఎకరం రూ.4 లక్షలే. ఇప్పుడా భూములు ఎకరం రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షలకు కొంటున్నరు. అరవై, డబ్బు వేలకు అమ్ముడుపోయిన లోపలున్న పొలాల్ని ఇప్పుడు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షలకు కొంటున్నరు. మొన్ననే శివన్నగూడెం ఊరి పక్కన రోడ్డుపొంటి ఉన్న భూమి ఎకరం రూ.80 లక్షల నుంచి కోటివెట్టి కొన్నరు. కేసీఆర్ ఇట్ల మమ్ముల కోటీశ్వరుల్ని జేసిండు’ అని భూముల ముచ్చటంతా జెప్పిండు.
చెప్పినవి చేసింది కేసీఆర్ ఒక్కడే
ఎన్నో ఏండ్ల సంది పోరాటాలు జేసినా నీళ్లు రాలే. నీళ్లిస్తమని వచ్చినోడల్లా చెప్పుకుంట పోయిండు. కానీ, చెప్పింది చేసినోడు కేసీఆర్ ఒక్కడే. మా చెరువు నిండితె రెండు నెలల్లనే ఎండిపోతది. కేసీఆర్ వచ్చిండు. నీళ్లు తెస్తున్నడు. శివన్నగూడెం ప్రాజెక్టు నీళ్లతోని మా ఊరి చెరువు నింపుతరట. ఇది నిండితె మా బతుకు పండుగే!
– ఇరిగి లక్ష్మయ్య, రైతు, ఇడికుడ, చండూరు