అందోల్, ఏప్రిల్ 16: మాజీ సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచి అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ సభలో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అబద్ధ్దాలు, అలవికాని హామీలతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 140 రోజులైందని, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు.
కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని, ఇప్పటికీ చేయలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో ఆగస్టు 15న రుణమాఫీ అంటూ కొత్తపాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ కావాలన్నా.. ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడం ఒక్కటే మార్గమని ప్రజలకు పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.