హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తీరు అనుమానాలకు తావిస్తున్నది. జాతీయస్థాయిలోనూ మహిళల ఫిర్యాదుల పట్ల వివక్షను చూపుతున్నదనిపిస్తున్నది. జాతీయ మహిళా కమిషన్ తన, మన అనే లెక్కలు వేస్తున్నదా? అంటే.. అవుననే సమాధానం వస్తున్నది.గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో అభ్యంతరాన్ని వెతికి మరీ ఆ కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్సీడబ్ల్యూ.. ఎమ్మెల్సీ కవితపట్ల బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను చూసీచూడనట్టు వదిలేసింది. దేశవ్యాప్తంగా ఈ విషయంపై ఆందోళనలు చేస్తున్నా..కమిషన్ చెవులుండి వినపడనట్టు ప్రవర్తిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకపోవడంపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి గవర్నర్పై పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో అభ్యంతరాలను వెతికిన జాతీయ మహిళా కమిషన్ ఫిబ్రవరి 14న నోటీసును అందజేసింది. ఫిబ్రవరి 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ హాజరుకాకపోతే, అతనిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని పేరొన్నది. కౌశిక్రెడ్డి విషయంలో అంత త్వరగా స్పందించిన మహిళా కమిషన్.. బండి సంజయ్ అవమానకర వ్యాఖ్యలపై నోరు మెదపటం లేదు. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన వెంటనే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సంజయ్పై చర్య తీసుకోవాలని తెలంగాణ డీజీపీని కోరడమే కాకుండా, నోటీసు జారీ చేస్తామని ప్రకటన ఇచ్చింది. ఎన్సీడబ్ల్యూ మాత్రం మౌనంగా, ప్రేక్షకపాత్రను పోషిస్తున్నది. ఇక తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టని గవర్నర్.. టెలివిజన్ టాక్షోలను ఇందుకు ఉపయోగించుకున్నారు. మహిళా దినోత్సవ వేడుకల్లో కూడా ఈ అంశంపై మాట్లాడారు. కానీ, బండి సంజయ్ వ్యాఖ్యలపట్ల మాత్రం అటు ఎన్సీడబ్ల్యూ, ఇటు గవర్నర్ స్పందించకపోవటం యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచింపచేస్తున్నది.