జోగులాంబ గద్వాల : జిల్లాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర కాదని దొంగ యాత్ర అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం మతం పేరు మీద రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఏనాడు దేవాలయాలకు నిధులు ఇచ్చారా అని ప్రశ్నించారు. కేవలం మెజార్టీ ఉన్న హిందువుల ఓట్ల కోసం ఇరువర్గాల మధ్య రెచ్చగొట్టి మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.పాదయాత్ర అంటే ప్రజల సమస్యలను తెలుసుకొడానికి చేయాలని, కానీ అర్థం కాని పాదయాత్ర చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అమలు కానీ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, మహబూబ్నగర్ డీసీసీబీ చైర్మన్ నిజాం బాషా తదితరులు పాల్గొన్నారు.