BJP | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతానికి బయటికి కనిపించకపోయినా అంతా నివురుగప్పిన నిప్పులాగానే ఉన్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీలో బండి సంజయ్ ఆధిపత్యాన్ని, ఒంటెద్దు పోకడలను, ఆయన కోటరీ చేస్తున్న అతిని మొదటి నుంచీ అర్వింద్ వ్యతిరేకిస్తున్నారు.
పార్టీలో తన పేరు తప్ప మరెవరి పేరూ వినిపించకూడదని, కేంద్ర కార్యాలయంలో కేవలం తన మనుషులే ఉండాలన్నది మొదటి నుంచీ బండి సంజయ్ అనుసరిస్తున్న విధానం. ఇందులో భాగంగా అనేక మందిని కేంద్ర కార్యాలయం నుంచి బయటికి పంపించేశారు. తనకు అనుకూలమైన బ్యాచ్తో పొగిడించుకుంటూ వ్యక్తి ఆరాధన మొదలుపెట్టారు. ఈ పరిణామాలు అర్వింద్కు మింగుడుపడటం లేదు. ఈ విషయాలపై ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. అయితే, ఇటీవల ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఇదే అదనుగా ధర్మపురి అర్వింద్ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. పదవి అనేది పవర్ సెంటర్ కాదని బండి సంజయ్ని దెప్పి పొడిచారు. అందరినీ సమన్వయం చేసుకోవాలంటూ హితవు పలికారు.
ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. వెంటనే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు సమచారం. ఈ అంశంతోపాటు ఇతర విషయాలపైనా అర్వింద్ కూడా అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వీరిద్దరి మధ్య కొట్లాట క్షేత్రస్థాయి వరకు వెళ్తుండటం, క్రమంగా సంఘ్ వర్సెస్ బీజేపీగా మారుతుండటంతో ఢిల్లీ పెద్దలు అలర్ట్ అయినట్టు సమాచారం. ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అర్వింద్కు సూచించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ముఖ్యంగా మీడియాతో మాట్లాడొద్దని అర్వింద్కు కచ్చితంగా చెప్పినట్టు తెలిసింది. దీంతో 4 రోజులుగా ధర్మపురి అర్వింద్ సైలెంట్ అయ్యారు. మీడియా సమావేశాలు నిర్వహించడం లేదు. కనీసం సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టడంలేదు. ఇదే విషయాన్ని పార్టీ నేతలు అడిగితే పార్లమెంట్ సమావేశాలు ఉండటం వల్ల సమయం దొరకడం లేదని చెప్పి తప్పించుకుంటున్నట్టు తెలిసింది. వాస్తవానికి శని, ఆదివారాల్లో పార్లమెంట్ ఉండదు. ఇదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ నాయకులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కనీసం వాటిని కూడా షేర్ చేయడం లేదు. అర్వింద్ సైలెంట్ కావడంతో బండి సంజయ్ సంతోషంగా ఉన్నట్టు సమాచారం.