హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకొన్నారు. అభ్యంతరకరమైన భాషను వాడుతూ దూషణలకు దిగారు. ‘టీఎన్జీవో నేతలు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారు. ప్రమోషన్లు, పైరవీల కోసం సిగ్గులేకుండా టీఆర్ఎస్కు మద్దతిస్తున్నారు. టీఆర్ఎస్కు టీఎన్జీవోలు మద్దతువ్వడం సిగ్గుచేటు. వారిపై కేసులు పెట్టాలి’ అంటూ నోరుపారేసుకొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు రగిలిపోతున్నారు. సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసకొని నడిపిందే టీఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాలు. రాష్ట్రం వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో అప్పటి వలసవాద ప్రభుత్వాలకు ఎదురొడ్డి నిలిచిన చరిత్ర ఈ సంఘాలది. ఉమ్మడి ఏపీ పేరుతో ఉన్న ఉద్యోగ సంఘాలను చీల్చి.. తెలంగాణ పేరుతో సంఘాలను ఏర్పాటు చేసి ఆత్మగౌరవ బావుటా ఇదే ఉద్యోగులు ఎగరేశారు. అలాంటి సంఘాన్ని అవమానపరచడమంటే యావత్తు ఉద్యోగులను అవమానించినట్టేనని ఉద్యోగసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
జై తెలంగాణ అన్న ప్రతి రాజకీయ పార్టీకి టీఎన్జీవో, ఉద్యోగ సంఘాలు మద్దతిచ్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషషన్రెడ్డి చేపట్టిన తెలంగాణ పోరుయాత్రలో కూడా టీఎన్జీవోలు పాల్గొన్నారు. అప్పడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని నిలదీశారు. 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు సకల సనులు సమ్మెతో యావత్ దేశాన్ని తెలంగాణవైపు తిప్పింది ఈ సంఘాలే. నాటి ముఖ్యమంత్రికే జీతం రాకుండా ఉద్యమాన్ని నడిపిన ఘనత ఈ ఉద్యోగ సంఘాలది. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటినీ జై తెలంగాణ అనేలా ఒత్తిడి తెచ్చింది ఈ సంఘాలే. అలాంటి పోరాటాన్ని విస్మరించి ఉద్యోగ సంఘాల నేతలను బండి సంజయ్ అవమానించడం దారుణమని ఉద్యోగులు జేఏసీ నేతలు మండిపడ్డారు. టీఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నేతలు తెలంగాణకు, తెలంగాణ ప్రయోజనాలకు మాత్రమే బానిసలని స్పష్టంచేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఏ పార్టీ పనిచేసినా వ్యతిరేకిస్తామని తేల్చి చెప్పారు. తమను అవమానిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు..
నేడు నల్ల బ్యాడ్జీలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన
బండి సంజయ్ బేషరతుగా ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. గతంలో రెండుమూడుసార్లు ఇలాగే మాట్లాడితే ఖండించినం. అయినా పద్ధతి మార్చుకోకుండా అలాగే మాట్లాడటం దారుణం. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతాం. బండి సంజయ్కి, బీజేపీకి ఉద్యోగుల సత్తా ఏంటో చూపుతాం. భవిష్యత్తు కార్యాచరణ కోసం సోమవారం టీఎన్జీవోల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అవసరమైతే విధులు బహిష్కరిస్తాం.
– మామిండ్ల రాజేందర్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్
ఆరు లక్షల ఉద్యోగులను అవమానపరిచినట్టే
అనాడు తెలంగాణ కోసం టీఎన్జీవోలు పోరాటం చేసినప్పుడు ఉద్యమంలో ఏనాడు కనిపించని వ్యక్తి.. తెలంగాణ ఆకాంక్షల కోసం పోరాడిన టీఎన్జీవోలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత దారుణం. అమ్ముడుపోయారనడమంటే రాష్ట్రంలోని 6 లక్షల ఉద్యోగుల
హృదయాలను గాయపరిచినట్టే. టీఎన్జీవోలను అవమానించడమంటే.. తెలంగాణ ఆకాంక్షను అగౌరవపరచడమే. బండి సంజయ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఉద్యోగులందరికీ
బహిరంగ క్షమాపణ చెప్పాలి.
– దేవిప్రసాద్రావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు
3పైరవీల కోసం పాకులాడేవాళ్లమా?
తెలంగాణ కోసం టీఎన్జీవోలు పోరాటం చేసినప్పుడు కనిపించని బండి సంజయ్.. అనుచిత వ్యాఖ్యలతో ఉద్యోగులను అవమానించారు. ఉద్యోగ నేతలను పదోన్నతులు, పైరవీల కోసం పాకులాడేవాళ్లు అనడం అత్యంత హేయం. ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు పోషించిన పాత్ర సంజయ్కి తెలియదనుకుంటా. ఎంపీగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. మాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్ర అభివృద్ధికి ఎవరు కట్టుబడి పనిచేస్తే వారి వెంట నడుస్తాం. ఆయన తక్షణమే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆయనకు, బీజేపీకి ఉద్యోగుల సత్తా ఏంటో చూపుతాం. క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలుంటాయి.
– మమత, ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్