Bandi Sanjay | వికారాబాద్ : బీజేపీ – బీఆర్ఎస్ పొత్తు కాంగ్రెస్ పార్టీ సృష్టి అని బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు. బీజేపీ బీఆర్ఎస్తో రహస్యంగా పొత్తు కుదుర్చుకుందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడారని సంజయ్ పేర్కొన్నారు. తాండూరులో విజయ సంకల్ప్ బస్సు యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని సంజయ్ తెలిపారు. ఒంటరిగానే లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీ కూడా కచ్చితమైన నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ తెలిపారు.