కరీంనగర్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత ఇలాకాలో నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. భైంసాలో ప్రారంభమైన బండి ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత పాదయాత్రను కరీంనగర్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఘనంగా ముగించాలని ఆ పార్టీ నేతలు కన్న కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. గురువారం సాయంత్రం స్థానిక ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఐదో విడత పాదయాత్ర ముగింపు సభకు అతి తక్కువ సంఖ్యలో జనం వచ్చారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాకముందే అందులో సగం మంది ఇంటిబాటపట్టారు.
‘ఎవరూ వెళ్లొదు’ అంటూ బండి సంజయ్ బతిమిలాడినా జనం వినిపించుకోలేదు. జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్చుగ్ సభకు వచ్చేసరికి సగం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఇంకాస్త సమయం ఇలాగే ఉంటే ఆ జనాలుకూడా ఉండరని భావించిన జేపీ నడ్డా..కిషన్రెడ్డి, తరుణ్చుగ్ మాట్లాడకముందే మైక్ అందుకున్నారు. బీజేపీ రాష్ర్టానికి ఏం చేసింది? బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పకుండా..బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై విమర్శలకే ఆయన పరిమితం కావడంతో అక్కడున్నవారంతా పెదవివిరిచారు.
చివరికి పెద్ద సంఖ్యలో జనం సభనుంచి వెనుదిరగడంతో కిషన్రెడ్డి, తరుణ్చుగ్ ప్రసంగించకుండానే సభను ముగించారు. కాగా, అంతకుముందు స్థానిక తెలంగాణ చౌక్లో జేపీ నడ్డాను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ర్టానికి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎందుకొస్తున్నావంటూ మండిపడ్డారు. ‘నడ్డా గో బ్యాక్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.