Bandi Sanjay | కథలాపూర్, ఏప్రిల్ 12: వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ వద్ద దీక్ష చేయాలని బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా కథలాపూర్లో మీడియాతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్రమోదీ పదేండ్ల పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ.. ఈనెల 14న కరీంనగర్లో దీక్ష చేస్తానంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడంపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. మోదీ పాలనలో కరోనా సమయంలో దేశ ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి రూ.12 వేల కోట్లు ఇచ్చినందుకా? 370 ఆర్టికల్ను రద్దుచేసి కాశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేసినందుకా? పౌరసత్వ చట్టసవరణ చేసినందుకు దీక్ష చేస్తారా? దేనికి దీక్ష చేస్తారో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలని డిమాండ్ చేశారు.