కరీంనగర్ రూరల్, నవంబర్ 20: యాభై ఏండ్లు పాలించి తెలంగాణ వెనుకబాటుకు కారణమైన దరిద్రమైన కాగ్రెస్ కావాలా? పదేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన బీఆర్ఎస్ కావాలా? ప్రజలు ఆలోచించాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ మండలంలోని గోపాల్పూర్, ఎలబోతారం గ్రామాలతోపాటు సా యంత్రం నగరంలోని 47, 31, 50, 10 డివిజన్లలో సోమవారం ప్రచారం చేశారు.
ఆయా చోట్ల మంత్రి గంగుల మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని ఎంపీగా గెలిపిస్తే నాలుగున్నరేండ్లు పత్తాలేకుండా పోయి.. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనేందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. నాలుగున్నరేండ్లుగా ఎంపీగా బండి సంజయ్ చేసిన అభివృద్ధిపై మహిళలు నిలదీయాలని చెప్పారు. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని చెప్పారు.