రాయచూర్కు పోయి చూడు..
కర్ణాటక, తెలంగాణ మధ్య తేడా తెలుస్తుంది
మోదీ పైసలిచ్చి ఉంటే.. ఇక్కడి పథకాలు అక్కడ లేవేమీ?
కర్ణాటకలో 40 శాతం కమీషన్లపై మాట్లాడవేం
ఏం ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నవు
నీ యాత్రను అడ్డుకొనే ఖర్మ టీఆర్ఎస్కు లేదు
రాష్ర్టానికి కేంద్ర సర్కారు ఏం చేసిందో చెప్పాలి
దేశంలో ఉచిత విద్య, వైద్యంపై చట్టం చేయండి
మేం సంపూర్ణంగా మద్దతిస్తాం: మంత్రి కేటీఆర్
తెలంగాణ పథకాల్లో కేంద్రం వాటా డబ్బులున్నాయని చెప్తున్న బండి సంజయ్.. బీజేపీ పాలిత కర్ణాటకలో తెలంగాణ తరహా పథకాలు ఎందుకు లేవో చెప్పాలి. రాయచూర్ లోని బీజేపీ ఎమ్మెల్యే కూడా తమను తెలంగాణలోనే కలుపాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ పాలిత కర్ణాటకలో కొనసాగడం వారికి ఇష్టం లేదు. నోటికొచ్చినట్టు అపసవ్య కూతలు కూయడానికి సిగ్గులేదా?
–మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణాలోని పథకాలకు, ప్రాజెక్టులకు నిధులు ఇచ్చి ఉంటే.. పక్కనే ఉన్న బీజేపీ పాలిత కర్ణాటకలో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు కావడంలేదని రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశ్నించారు. హెచ్ఐసీసీలో ఈనెల 27వ తేదీన జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ సమావేశ ఏర్పాట్లను కేటీఆర్ సోమవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఆ పక్కనే ఉండే కర్ణాటకలో పర్యటించాలని, రాయచూరు, బీదర్లకు వెళ్లి బీజేపీ పాలనపై అక్కడి ప్రజలు ఎట్లా ఉన్నారో తెలుసుకొని రావాలని సూచించారు.
బీజేపీ పాలన ఎట్లా ఉన్నదో తెలుసుకొనేందుకు బండి సంజయ్ కర్ణాటకలో పర్యటిస్తానంటే.. ఆయన కోసం ప్రత్యేకంగా వాహనాలు కూడా ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. కర్ణాటకలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్టు రైతుబంధు, రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు అందుతున్నాయో.. లేదో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు చూడాలని హితవు చెప్పారు. కర్ణాటకలో అక్కడి మంత్రులు కాంట్రాక్టర్లను 40 శాతం కమీషన్ కోసం వేధించిన ఘటనలపై బండి స్పందించాలని డిమాండ్చేశారు. ఇక గుజరాత్లో పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించారని, బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ.. అసమర్థ పరిపాలన జరుగుతున్నదని చెప్పారు.
ఆ ఉచితమేదో ఇప్పుడివ్వండి
తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని బండి సంజయ్ చెప్తున్నారని, దేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీయే.. ప్రధానమంత్రిగా ఉన్నది నరేంద్రమోదీయేనని, దేశవ్యాప్తంగా ఒక చట్టంచేసి ప్రజలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామనిచెప్తే టీఆర్ఎస్ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. డొల్లమాటలు, ఫాల్తు ముచ్చట్లు బంద్ చేయాలని హితవు చెప్పారు. ఆయన చేసే పాదయాత్రను అడ్డుకొనే ఖర్మ టీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు.
ఊరూర పార్టీ జెండా ఆవిష్కరించాలి
ఈనెల 27వ తేదీన పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలు, నాయకులు ఊరూరా పార్టీ జెండాను ఆవిష్కరించాలని, పార్టీకి చెందిన గ్రామ, వార్డు, డివిజన్ కమిటీ నాయకులు ఎక్కడికక్కడ ఉత్సవాలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణపై కార్యకర్తలు, ఇతర నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 27న 11 గంటల 5 నిమిషాలకు హెచ్ఐసీసీలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ జెండా ఆవిష్కరిస్తారని చెప్పారు. అదే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా జెండా ఆవిష్కరణ జరగాలని ఆదేశించారు. తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అన్న విషయాన్ని ఎలుగెత్తి చాటాలని, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేది టీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాల ప్రాతిపదికన టీఆర్ఎస్ ఆవిర్భవించిందని ఏప్రిల్ 27తో 21 సంవత్సరాలు నిండి యుక్త వయసులోకి వచ్చిందని చెప్పారు. 27న ఉదయం పది గంటలలోపు ప్రతినిధుల సమావేశ మందిరం వద్దకు చేరుకోవాలని, ఉదయం 10 గంటల నుంచి 11 వరకు ప్రతినిధుల రిజిస్ట్రేషన్ ఉంటుందని తెలిపారు. సమావేశం సాయంత్రం అయిదు గంటల వరకు కొనసాగుతుందన్నారు.
నాయకులతో సమావేశం..
హెచ్ఐసీసీలో ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాధవరం కృష్ణారావు, భేతి సుభాష్రెడ్డి, సాయన్న, గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్గౌడ్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు కూర్మయ్యగారి నవీన్కుమార్, శంబీపూర్రాజు, మహేందర్రెడ్డి, ఎగ్గె మల్లేశం, భానుప్రసాద్రావు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ ఛైర్మన్ గాదరి బాలమల్లు, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, చిరుమల్ల రాకేశ్, బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులతో కూడా సమావేశమయ్యారు.
అక్కడేవీ ఈ పథకాలు
తెలంగాణలో అందుతున్న పథకాల్లో కేంద్రం వాటా డబ్బులున్నాయని చెప్తున్న బండి సంజయ్.. బీజేపీ పాలిత కర్ణాటకలో తెలంగాణ తరహా పథకాలు ఎందుకు లేవో చెప్పాలని కేటీఆర్ అన్నారు. రాయచూరులోని బీజేపీ ఎమ్మెల్యే కూడా తమను తెలంగాణలోనే కలుపాలని డిమాండ్ చేస్తున్నారని, బీజేపీ పాలిత కర్ణాటకలో కాదని గుర్తుచేశారు. నోటికొచ్చినట్టు అపసవ్య కూతలు కూయడానికి సిగ్గులేదా అని బండిపై మండిపడ్డారు. కర్ణాటకలోని అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పాలని బండిని డిమాండ్ చేశారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వీర్యానికి కేంద్రం కుట్ర చేస్తుంటే.. శిఖండి వంటి కృష్ణా రివర్మెనేజ్మెంట్ బోర్డును ఏర్పాటుచేస్తుంటే ఎందుకు మాట్లాడలేదని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీజేపీ చేసిందేమిటని ప్రశ్నించారు. మతపిచ్చిని రెచ్చగొట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు. తెలంగాణాలోని ఏదైనా దేవాలయానికి బీజేపీ ఒక్కపైసా ఇచ్చిందా.. వేములవాడకు ఇవ్వలేదు.. యాదాద్రికి ఇవ్వలేదు.. జోగులాంబకు ఇవ్వలేదని తెలిపారు.
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కమిటీలు
హెచ్ఐసీసీలో ఈ నెల 27న నిర్వహించే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పలు కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీల వివరాలను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రకటించారు.
1. ఆహ్వాన కమిటీ
సబిత, రంజిత్రెడ్డి, అరికెపూడి గాంధీ, గద్వాల విజయలక్ష్మి, మంచిరెడ్డి కిషన్రెడ్డి
2. సభా వేదిక, ప్రాంగణం అలంకరణ కమిటీ
మాగంటి గోపీనాథ్, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి
3. ప్రతినిధుల నమోదు, వలంటీర్ల కమిటీ
శంభీపూర్ రాజు, రావుల శ్రీధర్రెడ్డి, మన్నె క్రిశాంక్
4. వాహనాల పార్కింగ్ ఏర్పాట్ల కమిటీ
కేపీ వివేకానంద, బండి రమేశ్, బొంతు రామ్మోహన్
5. భోజనం.. ఆతిథ్యం కమిటీ
మాధవరం కృష్ణారావు, కూర్మయ్యగారి నవీన్కుమార్, మలిపెద్ది సుధీర్రెడ్డి
6. తీర్మానాల కమిటీ
సిరికొండ మధుసూదనాచారి, పర్యాద కృష్ణమూర్తి, ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి
7. మీడియా కమిటీ
బాల్క సుమన్, భానుప్రసాద్, గువ్వల బాలరాజు, కర్నె ప్రభాకర్