Bandi Sanjay | తమ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్.. మాట నిలుపుకోవడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. వంద రోజుల డెడ్లైన్ పూర్తయ్యిందని.. మరి ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రజాహిత యాత్రలో భాగంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో పర్యటించిన బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన గడువు ఇవాల్టితో ముగిసిందని తెలిపారు. కానీ వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. ఎన్నికల హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
వంద రోజుల్లోనే మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇస్తామని మోసం చేశారని అన్నారు. రైతు భరోసా కింద రూ.15వేలు ఎందుకివ్వడం లేదని నిలదీశారు. రూ.4వేల పింఛన్ ఎందుకు అమలు చేయట్లేదని.. విద్యార్థులకు రూ.5లక్షల భరోసా కార్డు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ను అందరికీ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి.. అధికారంలోకి రాగానే ఎందుకు కోతలు పెట్టారని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో మీకు ఎందుకు ఓటేయ్యాలని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.