హుస్నాబాద్, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో లేనిపోని అల్లర్లు సృష్టించి సీఎం రేవంత్రెడ్డిని గద్దె దించి, మరొకరిని కుర్చీ ఎక్కించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం దుందుడుకు చర్యలు, ప్రతి చిన్న విషయానికి కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించడాన్ని బట్టి చూస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయని చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియామకం తరువాత ఆయనపై పొన్నం ఎన్నో విమర్శలు చేశారని గుర్తుచేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యలకు తప్పుడు అర్థాలను ఆపాదించుకొని కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధ్ది పొందేందుకు పొన్నం ప్రభాకర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులు, గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులు, రైతుల కోసం ఉద్యమించిన చరిత్ర తనదని, పొన్నంకు ఏ చరిత్ర ఉన్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఒకవేళ ఓడిపోతే పొన్నం మంత్రి పదవిని, రాజకీయాలను వదులుకుంటాడా? అని సవాల్ విసిరారు.