రాజన్న సిరిసిల్ల : అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను(Six guarantees) అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress) ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ విమర్శించారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే వచ్చే మార్చి, ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముంది.
ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమంటే డ్రామాలాడటమేనని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామానికి వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.