హైదరాబాద్, జనవరి 3 : ఆయన ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు.. పేరుకే గొప్ప.. విషయం అసలే లేదు. రూల్స్ తెల్వదు, రెగ్యులేషన్స్ తెల్వదు. వాస్తవాలు అంతకన్నా తెల్వదు. లొల్లి చేయాలంతే.. కుట్రలు పన్నాలంతే.. ఒకరిద్దరు వ్యక్తులు సొంతూళ్లలోనే ఉద్యోగం చేసుకోవాలని ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలను పట్టుకొని దీక్షకు కూర్చున్నారు బండి సంజయ్. ఉద్యోగులను గందరగోళపర్చాలన్నదే ఆయన అజెండా.ఉద్యోగులను గందరగోళపరిచేందుకు స్థానికత పేరుతో దీక్ష చేయాలని చూసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఉద్యోగులకు సంబంధించిన రూల్స్ తెలియనే, తెలియవు. స్థానికతకు, సీనియారిటీకి తేడా తెలియదు. కొందరు వ్యక్తులు తమ సొంతూళ్లలో ఉద్యోగం చేసుకోవాలని అవగాహన లేక ఆరోపణలు చేస్తే, దాన్ని పట్టుకొని గందరగోళ పరిస్థితులు సృష్టించాలని చూస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో చిచ్చు పెట్టి లబ్ధి పొందటమే ప్రధాన లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అన్ని సంఘాలతో మాట్లాడి, రాతపూర్వక హామీ తీసుకొన్నాకే ముందడుగు వేసింది. అంతా సవ్యంగా జరుగుతుండగా, ప్రక్రియ అంతా చివరి దశకు చేరుకుంటుండగా, లేని సమస్యను సృష్టిస్తూ కుట్రలకు పాల్పడుతున్నారు. అసలు కిటుకేంటంటే ఉద్యోగుల కేటాయింపునకు స్థానికత వర్తించదు. కేవలం ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్ల విషయంలోనే స్థానికత వర్తిస్తుంది. బదిలీలు, కేటాయింపులప్పుడు స్థానికతను పరిగణనలోకే తీసుకోరు.
జీవో 124లో స్పష్టత
సీనియారిటీ ప్రకారమే ఉద్యోగులను కేటాయిస్తామని 2018 ఆగస్టు 30న జారీచేసిన జీవో 124లో వెల్లడించింది. ఈ జీవోలోని 4, 5 పేరాల్లో మూడేండ్ల క్రితమే ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పేరా 5 క్లాజు సీలో ఉద్యోగిని ఒక లోకల్ క్యాడర్ నుంచి మరో లోకల్ క్యాడర్కు బదిలీచేసేటప్పుడు పూర్వపు సీనియారిటీని పరిగణనలోకి తీసుకొంటామని తేల్చిచెప్పింది. అంతేకాకుండా పేరా 4లో పరిపాలన అవసరాలు, ఉద్యోగి పనితీరు, భాషాపరిజ్ఞానం, నైపుణ్యాలు, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని కేటాయిస్తామని పేర్కొన్నది. మొత్తం నాలుగు క్లాజుల్లో ఎక్కడా స్థానికత అంశం లేకపోవడం గమనార్హం.
డీవోపీటీ మార్గదర్శకాల ప్రకారమే
ఉద్యోగుల కేటాయింపు మార్గదర్శకాల జారీలో సర్కారు ఆచితూచి వ్యవహరించింది. రాష్ట్రాల విభజనకు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) జారీచేసిన మార్గదర్శకాలనే కొత్త జోనల్ విధానం అమలుకు అనుసరించింది. ఆయా మార్గదర్శకాలను మూడేండ్ల క్రితమే జీవో 124 ద్వారా వెల్లడించింది.
బండి సంజయ్కు స్థానికతపై మాట్లాడే నైతికత లేదు
ఉద్యోగుల బదిలీలు, కేటాయింపుల్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయం చేస్తున్నారు. స్థానికతపై మాట్లాడే నైతికహక్కు బీజేపీకి లేదు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉద్యోగుల విభజనలో స్థానికత అంశాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ఉద్యోగసంఘాలు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వంలో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వందలాది తెలంగాణ బిడ్డలు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాల్సిన పరిస్థితిని కల్పించింది. తెలంగాణ ఉద్యోగుల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. డీవోపీటీ ద్వారా స్థానికతను చేర్చి, దేశవ్యాప్తంగా అమలుచేయాలి. ఛత్తీస్గఢ్ రాష్ర్టాన్ని పదేండ్లు పాలించిన బీజేపీ ఎందుకు అక్కడి ఉద్యోగుల సమస్యను పరిష్కరించలేదు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉద్యోగుల మనోభావాలను గౌరవించారు. ఏపీకి వెళ్లిన తెలంగాణ ఉద్యోగులను రప్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారు. – దేవీప్రసాద్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు
సజావుగా కేటాయింపు
317 జీవోపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దు. సీనియారిటీ ప్రాతిపదికన కేటాయింపులు, బదిలీల ప్రక్రియ సజావుగా జరుగుతున్నది. దంపతులు, వికలాంగుల పోస్టింగ్ల సమస్యను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకొంటాం. జూనియర్లకు పదోన్నతులు రావనేది తప్పుడు ప్రచారం. దీనిని ఉద్యోగులు నమ్మొద్దు. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు వస్తాయి. సాఫీగా జరుగుతున్న ప్రక్రియను పక్కదారి పట్టించేవిధంగా ధర్నాలు చేయడం కరెక్టు కాదు. కొంతమందికి ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకొంటాం. -మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో అధ్యక్షుడు
అందరూ సహకరించాలి
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు, బదిలీల కోసం మంచి గైడ్లైన్స్ ఇచ్చారు. సీనియారిటీ ప్రాతిపదికన కేటాయింపులు, బదిలీలు చేస్తారు. దీనికి రాజకీయరంగు పులమడం కరెక్టు కాదు. కొత్త నియామకాల్లో స్థానికత ఉంటుంది కానీ, బదిలీల్లో సీనియారిటీనే ప్రాతిపదికగా ఉంటుంది. ఇప్పటికే 90 శాతానికి పైగా కేటాయింపులు, బదిలీలు జరిగాయి. ఎక్కడా సమస్య రాలేదు. రాజకీయ లబ్ధి కోసం సమస్య సృష్టిస్తున్నారు. ఉద్యోగుల కేటాయింపుల్లో కేవలం 40 వేల మంది మాత్రమే వేరే జిల్లాలకు వెళ్లారు. వివాదాలు సృష్టించడం మాని అందరూ
సహకరించాలి. -వీ మమత, టీజీవోఅధ్యక్షురాలు
విద్యార్థుల భవిష్యత్తు ఏమి కావాలి?
కొన్ని సంఘాలు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఉపాధ్యాయుల్లో 90 శాతం మందికి న్యాయం జరిగింది. బాధ్యతగల సంఘంగా నిర్మాణాత్మక సూచనలు చేశాం. పరస్పర బదిలీలు, వితంతువులు, అంతర్జిల్లా బదిలీల ద్వారా వచ్చినవారికి, సర్వీస్ కోల్పోయిన వారికి సర్వీస్ ప్రొటెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన పోస్టుల్లో తాజాగా నష్టపోయిన వారితో భర్తీచేసే అవకాశం ఉన్నది. ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తయితేనే పదోన్నతులు లభిస్తాయి. కొత్త నోటిఫికేషన్లు వస్తాయి. టీచర్ తన భవిష్యత్తు మాత్రమే చూసుకొంటే ఎలా? గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? ఆయా సంఘాలు కల్పిస్తున్న భ్రమల్లోంచి ఉపాధ్యాయులు బయటపడాలి. -కూర రఘోత్తంరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
గ్రామీణ విద్యార్థులకు చదువులెవరు చెప్పాలె?
కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉపాధ్యాయ, ఉద్యోగుల విభజన చేపట్టాలని గతంలో కోరిన సంఘాలు ఇప్పుడు అడ్డుపడుతున్నాయి. వారు సమస్యను సృష్టించే వారే తప్ప పరిష్కరించేవారు కాదు. సమస్యలుంటే అప్పీళ్ల ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఎన్జీవోలు, ఇతర ఉద్యోగుల విషయంలో రాని అభ్యంతరాలను కొన్ని సంఘాలు పనిగట్టుకొని లేవనెత్తుతున్నాయి. అంతా పట్టణాలు, నగరాల్లో ఉంటామంటే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు చదువులెవరు చెప్పాలె? ఉపాధ్యాయులంతా ఈ దిశగా ఆలోచించడం మంచిది. -పాతూరి సుధాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ