హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయిభగీరథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఈ నెల 8న రాత్రి పది గంటల సమయంలో పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లో పోక్సో చట్టం కింద నమోదైన కేసులోని ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించారు. బాధిత బాలిక వయసు 19 నుంచి 20 ఏండ్లు ఉంటాయని, కానీ ఆమె తల్లి తప్పుడు రికార్డులను సృష్టించి మైనర్గా చిత్రీకస్తున్నారని పేరొన్నారు. ‘వయసు తగ్గించి కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారు. బాధితురాలి వయసు 17 ఏండ్లు కాదు. 2021 ఆగస్టు 21న సదరు బాలికపై డ్రైవింగ్కు సంబంధించిన కేసు రికార్డుల ప్రకారం అప్పుడు ఆమెకు 15 ఏండ్లు. ఆ ప్రకారం ఇప్పుడు బాధితురాలి వయసు 19 నుంచి 20 ఏండ్లు. ఫిర్యాదుదారు కుమార్తెతో నేను సన్నిహితంగా ఉండటంతో రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై ఈ నెల 8న సాయంత్రం 5.30 గంటలకు కరీంనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాను.
ఈ విషయం తెలిసిన అయిదు గంటల్లోపు తనపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బహీరాబాద్ పీఎస్లో పోక్సో చట్టం కింద తప్పుడు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. విభేదాలు తలెత్తడంతోనే కేసు పెట్టారు. ఎనిమిది నెలల క్రితం జరిగిన ఘటన అని చెప్తూ ఈ నెల 8న పోలీసులకు కుట్రపూరితంగా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితురాలి కుటుంబంతో ఏవిధమైన సంబంధాలు లేవు. కాబట్టి వాళ్లను బెదిరించడం అనేది ఉత్పన్నం కాబోదు. పోలీసులు నమోదుచేసిన కేసులోని సెక్షన్లు నిరూపణ జరిగితే ఏడు సంవత్సరాల్లోపు శిక్ష మాత్రమే పడుతుంది. తప్పుడు ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్ట్ చేస్తే తీరని నష్టం జరుగుతుంది. ప్రజల్లో పేరు ప్రతిష్ఠలు ఉన్న కుటుంబంలోని సభ్యుడను. దర్యాప్తు అధికారికి, కోర్టు విచారణకు పూర్తిగా సహకరిస్తాను. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటాను. ముందస్తు బెయిల్ మంజూరు చేయండి’ అని భగీరథ్ తన పిటిషన్లో విజ్ఞప్తిచేశారు. ఈ వ్యాజ్యాన్ని ఈ నెల 14న హైకోర్టు విచారణ చేసే అవకాశముంది.