హైదరాబాద్: భారత దేశాన్ని అర్థంచేసుకోవడంలో బీజేపీ విఫలమయిందని ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. కొంత మందికి లబ్ధిచేకూర్చేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొన్ని బిల్లులు తీసుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు-పర్యవసానాలపై శాసనసభలో లఘ చర్చను బాల్క సుమన్ ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని, కరెంటు సరిగా లేక వ్యవసాయం, పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులను సీఎం కేసీఆర్ సరిదిద్దుతున్నారని చెప్పారు. దేశంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. వ్యవసాయంతోపాటు బలహీన వర్గాలకు ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు.
మోదీ సర్కార్ కొద్దిమంది కోసమే విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నదని బాల్క సుమన్ విమర్శించారు. కేంద్ర కుట్రలు ప్రజలకు తెలియాలన్నారు. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని చెప్పారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రంలో వ్యసాయ మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలిపారు. మహారాష్ట్ర రైతులకు కూడా సాయం చేసిన గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. వాళ్ల దోస్తులకు దోచిపెట్టడంలో బీజేపీ బిజీగా ఉందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పబలం అని చెప్పారు. బీజేపీని దేశం నుంచి వెళ్లగొట్టే నాయకత్వాన్ని కేసీఆర్ చేపట్టాలని యావత్ దేశం కోరుకుంటున్నదని చెప్పారు.