హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తున్నదని, పేదల ఇండ్లను కూలుస్తూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. హైడ్రా చర్యలతో పేదలెందరో ఆందోళన చెందుతున్నారని, వారిపై కక్షగట్టినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ ఖమ్మం ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే ఖమ్మంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని మున్నారు వరద బాధితులు అడ్డుకున్నారని తెలిపారు.
వర్షాలపై వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోలేదని తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖమ్మంలో పర్యటిస్తే కాంగ్రెస్ దాడులకు పాల్పడిందని తెలిపారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, వరద బాధితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పంటలు ఏ మేరకు నష్టపోయాయో అంచనా వేసి, రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు.