చండూరు, అక్టోబర్ 16: మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విడుదల చేసిన లేఖను ఖండిస్తున్నట్టు ప్రభు త్వ విప్ బాల్క సుమన్ చెప్పారు. ఆదివారం నల్లగొండ జిల్లా చండూరులో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బూర దురుద్దేశంతో అడ్డగోలుగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేయడమంటే.. సూర్యుడిపై ఉమ్మినట్టేనని మండిపడ్డారు. ఆత్మగౌరవం అంటున్న బూర నర్సయ్య.. ఢిల్లీలో రెండు రోజులు బీజేపీ నాయకుల అపాయిట్మెంట్ కోసం పడిగాపులు కాసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్పై బీసీ వ్యతిరేకి అని ముద్రవేయడం తన దుర్మార్గ ఆలోచనలకు నిదర్శనమన్నారు. బూర బేషరతుగా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మునుగోడులో బీజేపీ డిపాజిట్ గల్లంతు చేసి బుద్ధ్ది చెప్పాలని పిలుపునిచ్చారు. చీఫ్ విప్ దాస్యం మాట్లాడుతూ.. బూరకు టీఆర్ఎస్ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. సమావేశంలో చండూరు మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళవెంకన్న, కౌన్సిలర్లు అన్నెపర్తి శేఖర్, కోడి వెంకన్న, కొన్రెడ్డి యాదయ్య, పట్టణ అధ్యక్షుడు భూతరాజు దశరథ తదితరులు పాల్గొన్నారు.