హైదరాబాద్, మార్చి 8 : అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేశారని విప్ బాల్క సుమన్ విమర్శించారు. పథకం ప్రకారమే వారు సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సభలో చర్చ జరగాలి కానీ, రచ్చకాదని స్పష్టంచేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే విభజన హామీల సాధనకు ఢిల్లీలో పోరాటాలు చేయాలని డిమాం డ్ చేశారు. మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీలో మాట్లాడుతూ.. సభలో ఆర్థికమంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు పథకం ప్రకారం అడ్డుకోవటానికి ప్రయత్నించారని, ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లోకి దూసుకొచ్చి స్పీకర్ పోడియంవైపు వెళ్లారని తెలిపారు. మరో దారి లేకనే బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలు పథకం ప్రకారమే సభలో గొడవచేశారనటానికి వారి సస్పెన్షన్ తర్వాత బీజేపీ కార్యకర్తలు రోడ్లపై చేసిన హంగామాయే నిదర్శనమన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో కానీ, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కానీ వెల్లోకి దూసుకెళ్లే సభ్యులను సస్పెండ్ చేయాలని గతంలోనే బీఏసీ నిర్ణయించిందని గుర్తుచేశారు.
అభ్యర్థుల్లేకనే సీట్లు పెంచుతలేదు: భానుప్రసాదరావు
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసేందుకు బీజేపీకి అభ్యర్థులు లేకనే అసెంబ్లీ సీట్ల సంఖ్యను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచటం లేదని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు విమర్శించారు. కిషన్రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీ సీట్లను పెంచేలా కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగం ప్రాధాన్యం గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు.
బీజేపీకి కాంగ్రెస్ వత్తాసు: ఎగ్గె మల్లేశం
బీజేపీకి కాంగ్రెస్ వత్తాసు పలుకుతున్నదని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న పరిణామాలే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ను తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని చెప్పారు.
సభ్యుల సస్పెన్షన్ కొత్తకాదు
ఉద్దేశపూర్వకంగా సభా సమయాన్ని వృథా చేసే సభ్యులపై సస్పెన్షన్ వేటు పడటం కొత్తేమీ కాదని బాల్క సుమన్ తెలిపారు. పార్లమెంట్, వివిధ రాష్ర్టాల అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు సస్పెన్షన్కు గురైన సందర్భాలను వివరించారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఇష్టారీతిగా నోరుపారేసుకొంటున్నారని, బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రతిపాదిస్తున్నదో చూసే ఓపిక లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు. బడ్జెట్పై మాట్లాడేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి అనర్హుడని అన్నారు. బీజేపీ నేతలకు కండ్లు నెత్తికెక్కి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిషన్రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు డిపాజిట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. తమతో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ట్రెజరీ బెంచ్ మీద ఉన్నారని, ఇప్పుడు రోడ్లమీదకి వచ్చారని ఎద్దేశా చేశారు. బీజేపీ నేతలు నల్లకండువాలతో నిరసన తెలుపాల్సింది ప్రధాని ఇంటిముందు అని సూచించారు.