హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే రాష్ట్రం లో పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. పేపర్ లీకేజీలకు సూత్రధారులు బీజేపీ ఢిల్లీ పెద్దలైతే పాత్రధారులు రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రశాం త వాతావరణాన్ని చెడగొట్టాలని కుట్రలు చేస్తున్న బండి సంజయ్పై పీడీ యాక్ట్ కింద కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బుధవా రం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే ముఠా గోపాల్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ, పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతున్నదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక బీజేపీ లీకుల కుట్రకు తెరలేపిందని ఆరోపించారు.
బండి సంజయ్ పథకం ప్రకారం పేపర్ లీకేజీలకు ఆర్ఎస్ఎస్, ఏపీబీపీ, టీపీయూఎస్ సంస్థలను వినియోగిస్తున్నారని మండిపడ్డారు. అందుకు హనుమకొండ జిల్లా కమలాపూర్ పరీక్షా కేంద్రంలో టెన్త్ హిందీ పేపర్ లీకేజీకి కారకులైన ప్రశాంత్ నిర్వహించిన పాత్రే నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ రాజకీయ క్రీడలో భాగంగానే పేపర్ లీకేజీ అని మండిపడ్డారు. పేపర్ లీకేజీ కారకులు ఎంతటివారినైనా ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.
లీకేజీల నివారణకు టాస్క్ఫోర్స్: సుమన్
రాష్ట్రంలో అశాంతి సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధిపొందాలనే బీజేపీ కుట్రలో భాగంగానే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని వీటిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డీజీపీని కోరారు. లీకేజీలకు ఢిల్లీ పెద్దలు సూత్రదారులైతే, పాత్రదారులు బండి సంజయ్, ప్రశాంత్ అని, ప్లాన్ ప్రకారమే లీకేజీల వ్యవహారం నడిచిందని మండిపడ్డారు. కమలాపూర్లో హిందీ ప్రశ్నపత్రం లీకేజీ పాత్రదారి ప్రశాంత్కు ఆర్ఎస్ఎస్ నేత, రాష్ట్ర వ్యవహారాల సమన్వయకర్త సునీల్ బన్సల్, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్చుగ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్ తదితరులతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన ఫొటోలతో సహా మీడియాకు చూపించారు.
దిగజారుడు రాజకీయాలు: గొంగిడి
రాష్ట్రంలో బీజేపీ దిగజారుడు రాజకీయాల కు కాలం చెల్లిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పేర్కొన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ దుర్మార్గంగా పదో తరగతి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఎంచుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
బీజేపీ కుట్రలకు బుద్ధి చెప్తాం: గోపాల్
బీజేపీ కుట్రలను తిప్పికొట్టి తగిన బుద్ధి చెప్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ హెచ్చరించారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని దేశమంతా మార్పు కోసం బయలుదేరిన సీఎం కేసీఆర్ను ఏ శక్తీ ఆపలేదని అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన బండి సంజయ్పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
బుద్ధి జ్ఞానం లేని పార్టీ బీజేపీ: పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి
ప్రజాస్వామ్య స్ఫూర్తికి, నైతిక విలువలకు బీజేపీ ఏనాడో తిలోదకాలిచ్చిందని, బీజేపీ అంటే బురదజల్లే పార్టీగా మారిందని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ సామ్ను బీజేపీ సీమ్లా, రాజకీయ మైలేజ్ కోసం వాడుకుంటున్నదని మండిపడ్డారు. బీజేపీని బుద్ధి జ్ఞానం లేని పార్టీగా అభివర్ణించారు. సీఎం కేసీఆర్కు నేరుగా ఎదురొనే దమ్ము లేకనే బీజేపీ కుట్రలకు తెరదీసిందన్నారు.
జీవన్రెడ్డి ప్రదర్శించిన ప్రశాంత్ వాట్సాప్ షీట్
టెన్త్ హిందీ పేపర్ లీకేజీ వ్యవహారం అ నంతరం ప్రశాంత్ తన వాట్సాప్ గ్రూపు ల్లో ఏ విధంగా షేర్ చేశారో జీవన్రెడ్డి ఆధారాలతో సహా వివరించారు. బండి సం జయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, లక్ష్మణ్, సు నీల్ బన్సల్, జేపీ నడ్డా, తరణ్చుగ్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల బీజేపీ నాయకులకు, హైదరాబాద్, వరంగల్లోని మీడి యా ప్రతినిధులకు, తన సన్నిహితులకు స్వల్ప వ్యవధిలోనే ప్రశాంత్ చేరవేశారని తెలిపే షీట్ను జీవన్రెడ్డి ప్రదర్శించారు.