హైదరాబాద్: తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని గతంలో చెప్పిన బీజేపీ ఎంపీ బండి సంజయ్.. మాట మీద నిల్చుండాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయిస్తామని గతంలో బండి సంజయ్ మాట్లాడిన వీడియోలను ఆయన విడుదల చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంతో కలిసి బాల్క సుమన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా బాల్క సుమన్ మాట్లాడుతూ, యాసంగిలో వరి వెయ్యాలని, తామే కొనిపిస్తామని రైతులను బీజేపీ నాయకులు రెచ్చగొట్టి, ఇపుడు మాత్రం ధాన్యం కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనంటూ మాట మారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతాంగంపై కేంద్రం కక్ష గట్టిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్న తీరును ఖండిస్తున్నానని చెప్పారు. ధాన్యం సేకరణపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోయి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించాల్సింది పోయి వెనకేసుకు రావడం శోచనీయమని సుమన్ పేర్కొన్నారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యల వీడియోను బండి సంజయ్ అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 400 రెట్లు పెరిగిందని, ఇది కేసీఆర్ రైతు అనుకూల విధానాల వల్ల కాదా? అని బాల్క సుమన్ నిలదీశారు. కేంద్రం వంద శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసే దాకా తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఒకే దేశం ఒకే సేకరణ విధానం తేవాల్సిందేనని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మీద బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. జీడీపీ పెంచమంటే బీజేపీ సర్కారు గ్యాస్ డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతోందని ఎద్దేవా చేశారు. గుజరాత్ను దాటి పోతుందనే దుగ్ధతోనే బీజేపీ తెలంగాణపై కక్ష కట్టిందని మండిపడ్డారు.