Balka Suman | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలపై ఆ పార్టీ గుండాలు దాడులు చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో నిజంగానే ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లు.. కాల్చివేతలు అని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలపై ప్రజాపాలన అని చెప్పుకుంటూ దాడులు చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు శంకర్పై కాంగ్రెస్ గుండాలు పథకం ప్రకారం దాడి చేశారు. చంపాలని పాశవికంగా దాడికి పాల్పడ్డారు. ఇలాంటి పాశవిక దాడిని తెలంగాణ బుద్ది జీవులు, సమాజంలోని అన్ని వర్గాలు ఖండించాలన్నారు. అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడి చేయడమే ఇందిరమ్మ రాజ్యమా..? దీనిపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
చిలుక ప్రవీణ్, రంజిత్, ఆకుల ప్రవీణ్ అనే జర్నలిస్టుల మీద కూడా దాడులు, వేధింపులు జరిగాయని గుర్తు చేశారు. జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్త సాయిరాం రెడ్డి అని సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని సాయిరాం రెడ్డి కలిశాకే ఈ దాడి జరిగింది. శంకర్పై దాడికి ముందే సాయిరాం రెడ్డి రెక్కీ నిర్వహించాడు. సాయిరాం రెడ్డి హస్తినపురం కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి అనుచరుడు అని సుమన్ తెలిపారు.
మూడు నెలలు కాకముందే కాంగ్రెస్ పాలనలో అనేక ఆకృత్యాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. నిన్న మేడారంలో సీఎం రేవంత్ ముందే భక్తులపై లాఠీ చార్జీ చేశారు. ఇప్పటి దాకా 2600 మంది బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు అయ్యాయి. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా చెలరేగిపోతుందని ధ్వజమెత్తారు.
విసునూరు రామచంద్ర రెడ్డి, ఎర్ర పహాడ్, ప్రతాప్ రెడ్డి లాంటి దేశ్ముఖ్లలో దళిత బహుజనులు ఎలాంటి దాష్టీకాలు ఎదుర్కోన్నారో ఇప్పుడు నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో అవే దౌర్జన్యాలు ఎదురవుతున్నాయని తెలిపారు. నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో దళిత బహుజన జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. పోలీసులు కూడా అతిగా వ్యవహరిస్తున్నారు. మా వాళ్ళు ఫిర్యాదు చేస్తే చెత్తబుట్టలో వేస్తున్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఇది పోలీసులు గుర్తు పెట్టుకోవాలి.. మేము అన్ని గమనిస్తున్నాం అని బాల్క సుమన్ తెలిపారు. బీఆర్ఎస్కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు ఎందుకు బెదిరిస్తున్నారని సుమన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు ఏ పోస్టులు పెట్టినా చెల్లుతుందా..? అని నిలదీశారు. నయా దేశముఖ్ రేవంత్ 20, 30 ఏండ్లు అధికారంలో ఉంటారని పోలీసులు అనుకుంటున్నారా..? రేవంత్కు మీడియా పట్ల ఎలాంటి చులకన భావంతో ఉండే వారో ఆయన పాత వీడియోలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పాశవిక హింసాత్మక ధోరణిని రేవంత్ ఇప్పటికైనా మానుకోవాలి అని బాల్క సుమన్ హెచ్చరించారు.