నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 16 (నమస్తే తెలంగాణ): చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ను జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. సింగరేణి ఆస్తులపై దాడులకు ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సుమన్పై దేశద్రోహం చట్టం కింద బంజారాహిల్స్ పోలీసులు మరోసారి కేసు నమోదు చేసి, ప్రభుత్వ ఆస్తుల నష్టనిరోధక చట్టాన్ని సైతం జోడించారు. సుమన్పై రాజకీయ కక్షతో ఈ కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది తెలియజేసినప్పటికీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
కాగా, సుమన్ను 4 రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై వాదనలు ముగిశాయి. విచారణకు సుమన్ సహకరించలేదని, ఆయన నుంచి పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించాల్సి ఉన్నదని పీపీ తెలిపారు. దీనిపై సుమన్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ పేరిట కాలయాపన చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని, ప్రభుత్వం చెప్పినట్టుగా పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వాదనల అనంతరం తీర్పును బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.
బాల్క సుమన్ ప్రసంగానికి సంబంధించినవిగా చెప్తున్న వీడియోలను అధికారులు పెన్డ్రైవ్లో నిక్షిప్తం చేసి కోర్టుకు సమర్పించారు. ఆ ప్రసంగాలను పరీక్షించేందుకు ఆ పెన్డ్రైవ్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని కోరుతూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును బుధవారానికి రిజర్వు చేస్తున్నట్టు కోర్టు వెల్లడించింది.