ఖైరతాబాద్, మార్చి 22: గొల్ల, కురుమలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆరోపించారు. యాదవ, కురుమల రాజ్యాధికార ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘మేమెంతో.. మాకంత’ అనే అంశంపై హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బాలరాజు యాదవ్ మాట్లాడుతూ ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొల్ల, కురుమలకు ప్రాధా న్యం లభించింది. మంత్రి పదవితోపాటు రాజ్యసభ, శాసనమండలి సభ్యత్వాలు, ఎమ్మెల్యేలుగా అవకాశాలు, కార్పొరేషన్ చైర్మన్ల పదవులు లభించాయి.
కోకాపేటలో ఆత్మగౌరవ భవనం కోసం పది ఎకరాల జాగా, 10 కోట్లను బీఆర్ఎస్ సర్కార్ కేటాయించింది. గొల్ల, కురుమలు ఆర్థికంగా ఎదగడానికి 1.25 లక్షల గొర్రెల యూనిట్లను అందజేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా గొల్ల, కురుమలను పట్టించుకోవడం లేదు. తక్షణమే వారికి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించాలి. 2 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయాలి. ఎంపీ టికెట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకోవాలి. కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించాలి’ అని డిమాండ్ చేశారు. లేకుంటే కేసీఆర్, కేటీఆర్తో చర్చించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని బాలరాజు యాదవ్ హెచ్చరించారు. సమావేశంలో ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ బీనవేని రామ యాదవ్, ఆల్ ఇండియా యాదవ మహాసభ అధ్యక్షుడు రమేశ్ యాదవ్, మేకల కృష్ణయాదవ్, శ్రీహరియాదవ్ తదితరులు పాల్గొన్నారు.