Bajireddy Govardhan | హైదరాబాద్ : పార్టీ మారుతున్న వచ్చిన వార్తలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించారు. తాను పార్టీ మారడం లేదని చివరకు వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే తన ప్రయాణం కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.
తాను కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నట్లు నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు కొన్ని టీవీ చానెల్స్లో ఫేక్ ప్రచారం వచ్చింది. ఆ వార్త తప్పు.. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు మూడు సార్లు టికెట్ ఇచ్చారు. తన నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు గెలిపించారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ మారడం అనేది సరికాదు. పార్టీ మారితే బీఆర్ఎస్కు ద్రోహం చేసిన వ్యక్తిని అవుతాను. టికెట్ వచ్చినా, రాకున్నా కేసీఆర్ వెంటే తన ప్రయాణం కొనసాగుతోంది. కుట్ర పూరితంగా కొందరు కావాలని దుష్ర్పచారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయ ప్రస్థానంలో తనకు లైఫ్ ఇచ్చిన వారికి ఇప్పటి వరకు ద్రోహం చేయలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. తన శ్రేయోభిలాషులు, అభిమానులు ఎవరూ కూడా ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరారు బాజిరెడ్డి గోవర్ధన్.