మధిర, ఆగస్టు 8 : మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అశాస్త్రీయ టైంటేబుల్ను వెంటనే మార్చాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మధిర ప్రాంతంలోని పలు గురుకుల పాఠశాలలను శనివారం సందర్శించిన ఆయన, అకడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం అమలు చేస్తున్న టైం టేబుల్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించి వారు ప్రశాంత వాతావరణంలో నాణ్యమైన విద్యను బోధించేలా అధికారులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించి, హెల్త్ కార్డులు జారీ చేయాలని, నైట్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇచ్చి, ప్రత్యేకంగా కేర్ టేకర్లను నియమించాలని కోరారు. హాస్టళ్లకు రెగ్యులర్ వార్డెన్లను నియమించి, ఉపాధ్యాయులను కేవలం బోధనకే పరిమితం చేయాలని కోరారు. జూనియర్ లెక్చరర్లకు గెజిటెడ్ హోదా కల్పించాలని, విద్యార్థులకు ఏకరూప దుస్తులు(యూనిఫాం), అవసరమైన స్టడీ మెటీరియల్ కిట్లను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి, మైనార్టీ వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.దామోదర్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండారు నాగరాజు, ఈ.వీరయ్య, గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాళ్లు షమీమ్, సుష్మ, ముంతాజ్, శ్రావణి, రాజు, ట్రెజరర్ బి.చెన్నయ్య, షేక్ లాల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.