హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగటం ప్రధాని మోదీకి ఇష్టముండదని, అందుకే ఉద్దేశపూర్వకంగా బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, దానం నాగేందర్, జాజుల సురేందర్, కోరుకంటి చందర్ విమర్శించారు. ఇందులో భాగంగానే బీసీ సంక్షే మ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రల వ్యాపారాలపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గురువారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడారు. బీసీలపై మోదీకి ఎందుకింత అక్కసు అని, 8 ఏండ్లలో బీసీ అభ్యున్నతి కోసం ఏం చేశారని బాజిరెడ్డి ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బీసీలు ఎలా బతుకుతున్నారో, తెలంగాణలో ఎంత హుందాగా జీవిస్తున్నారో తెలుసుకోవాలనారు. మునుగోడులో ఓట మి జీర్ణించుకోలేకే బీజేపీ ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నదన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరగటం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. ఈడీ, ఐటీ, ఇతర దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు సొంతానికి వాడుకొంటున్నదన్నారు. రాజకీయం గా బీసీలను అణగదొక్కే కుట్ర చేస్తున్నదని, ఈ కుట్రలపై ఇతర పార్టీలతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, సురేందర్ మాట్లాడుతూ.. గంగుల, వద్దిరాజు రాజకీయాల్లోకి రాకముందు నుంచే వ్యాపారాల్లో ఉన్నారని, వారిని అప్రతిష్ఠపాలు చేసేందుకే ఐటీ దాడులు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో బీసీలు రాజకీయ, వ్యాపారరంగాల్లో రాణిస్తున్నారని, అది బీజేపీకి ఇష్టం లేకే దాడులు చేయిస్తున్నదని పేర్కొన్నారు. మోదీ తెలంగాణ పర్యటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. గంగుల, వద్దిరాజులకు తెలంగాణ సమాజమంతా అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పాల్గొన్నారు.