Bajireddy Govardhan | జగిత్యాల, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి ఝూటాకోర్ ముఖ్యమం త్రి అని, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస గ్రామంలో మంగళవారం పాదయాత్రను చేపట్టి, ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తర్వాత జగిత్యాల అర్బన్, రూరల్, జగిత్యాల పట్టణ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సాయంత్రం ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒరిజనల్ కాంగ్రెస్ కాదని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణంతోనే అది చచ్చిపోయిందని అన్నారు.
ఇప్పుడున్నది రేవంత్రెడ్డి తెలుగుదేశం డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కేసీఆర్ ఈ పదేండ్లలో తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దితే దాన్ని రేవంత్రెడ్డి నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో మూడు పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయించకుండా, కాళేశ్వరాన్ని వట్టిపోయేలా చేసి, కేసీఆర్ను బద్నాం చేయాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నాడని విమర్శించారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం వంద రోజుల్లో ఒక్క హామీని నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.ప్రధాని మోదీ, ఎంపీ అర్వింద్ కవితకు భయపడి ఆమెను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయించారని ఆరోపించారు. సమావేశాల్లో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.