హైదరాబాద్ సిటీబ్యూరో/బడంగ్పేట, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి పదిమందిపై సస్పెన్షన్ వేటు పడింది. తమకు అధికార పార్టీ నేతలే అండగా ఉన్నారు.. ఇక ఎవరేం చేస్తారు.. అన్న ధైర్యంతో రెచ్చిపోయిన కొందరు సిబ్బంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంచుకుతిన్నారు. దీంతో బడంగ్పేట సర్కిల్ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్తోపాటు ఇతర అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా పది మంది సస్పెండ్ అయ్యారు. ముగ్గురిని మాతృసంస్థకు పురపాలక శాఖ సరెండర్ చేయ గా.. మరో ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్ణయం తీసుకున్నారు. బడంగ్పేట మున్సిపల్ కా ర్పొరేషన్ పాలకవర్గం గడు వు ముగింపు సమయంతోపాటు జీహెచ్ఎంసీలో విలీ న సమయంలో అధికారులు-మాజీ ప్రజాప్రతినిధులు-కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగాల్లో భారీ అవినీతికి పాల్పడ్డారు. చేయని పనులు చేసినట్టు, పాత పనులకే మళ్లీ బిల్లులు వేయటం, టెండర్లు లేకుండానే నామినేషన్ విధానంలో ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లకే కోట్లాది రూపాయల పనుల అప్పగింత.. ఇలా ఒకటేమిటి! అవినీతికి కాదేదీ అనర్హం అన్న రీతిలో కార్పొరేషన్ ఖజానాను లూటీ చేశారు. అది చాలదన్నట్టు.. మరో రూ.122 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందంటూ జీహెచ్ఎంసీకి ప్రతిపాదనలు పంపారు.
ఈ నేపథ్యంలో రెండు విభాగాల్లో జరిగిన అవినీతి గుట్టును ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. వరుస కథనాలతో ప్రజాధనం దుర్వినియోగమైన విధానాన్ని బయటపెట్టింది. దీంతో జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగంతోపాటు అవినీతి నిరోధక శాఖ అధికారులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి లోతైన విచారణ నిర్వహించారు. దీంతో అక్రమార్కులు కొందరు ఏకంగా అవినీతి ఆనవాళ్లు ఉన్న ఫైల్స్నే కార్యాలయం నుంచి మాయం చేశారు. కాగా భారీ ఎత్తున జరిగిన అవినీతిని క్షేత్రస్థాయిలోనూ పరిశీలించిన విజిలెన్స్ అధికారులు అక్రమార్కుల బాగోతాన్ని నివేదిక రూపంలో కమిషనర్ కర్ణన్కు సమర్పించారు. దీంతో బాధ్యులైన బడంగ్పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరస్వతి సహా తొమ్మిది మంది అధికారులపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. వెంటనే వారి స్థానంలో ఇతర అధికారులను సైతం నియమించారు.