నీవు చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం
ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎందుకు గ్రానైట్ క్వారీలపై మాట్లాడలేదు
రాజీనామా చేస్తామన్న మాటకు ఎందుకు కట్టుబడి లేరు
ఆత్మ వంచనే తప్ప.. ఆత్మగౌరవం ఎక్కడుంది మీకు
ఈటలపై ప్రశ్నల వర్షం కురిపించిన మంత్రి గంగుల
టాక్సు ఎగ్గొట్టినట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అని సవాల్
కరీంనగర్, మే18 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) ;మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనపై చేసిన విమర్శలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. ఇదే సమయంలో.. మాట తప్పిన మాజీ మంత్రిగా ఆయన రాజకీయాల్లో నుంచి వైదొలుగుతారా? అని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నట్లు విమర్శలు చేస్తున్న రాజేందర్ వాటిని నిరూపిస్తారా? లేక చేసిన ఆరోపణలు తప్పని ఒప్పుకుంటారా? తేల్చి చెప్పాలని స్పష్టంచేశారు. అత్మగౌరవం పేరు తో కొత్త డ్రామాలకు తెరలేపింది ఎవరు? రాజీనామా చేస్తానని చెప్పి.. మాట మార్చింది ఎవరు? పదవుల కోసం పెదవులు మూయను అని చెప్పి అదే పదవి కోసం పాకులాడుతున్నది ఎవరు? అసైన్డ్ భూములు అక్రమించింది వాస్తవమేనని ఒప్పుకొని నిస్సిగ్గుగా అత్మగౌరవం అంటూ తిరుగుతున్నది ఎవరో? ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని సవాల్ విసిరారు. మంగళవారం కరీంనగర్లోని మీ సేవా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంగుల పలు ప్రశ్నలు సంధిస్తూ రాజేందర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎక్కడ నీ ఆత్మాభిమానం ?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్నట్లుగా ఆయన వద్ద ఆత్మాభిమానం లేదని ఆత్మవంచన చేయడం మాత్రమే తెలుసునని, దానికి ఇటీవల అతని మాటలనే ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ‘అసైన్డ్ భూములపై విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించగానే. హడావుడిగా విలేకరుల సమావేశం పెట్టి.. తన ఆధీనంలో అసైన్డ్ భూములున్న మాట నిజమేనని ఒప్పుకున్నది వాస్తవం కాదా? హుజూరాబాద్ వెళ్లి పార్టీ శ్రేణులతో మాట్లాడి ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తామని చెప్పింది నిజం కాదా? హుజూరాబాద్ వచ్చి రెండు రోజులుండి.. మళ్లీ హైదరాబాద్లో ఇంకా కొంత మంది నేతలున్నారు వారితో మాట్లాడి నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పలేదా? ఇందులో ఏ ఒక్క మాటకైనా రాజేందర్ కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్నించారు. పదవులకోసం పెదవులు మూసుకోనని చెప్పిన రాజేందర్… అదే పదవి కోసం ప్రస్తుతం పాకులాడుతున్నది ప్రజల కళ్ల ముందు కనిపిస్తోందని చెప్పారు. ఆరుసార్లు గెలిచానని, హుజూరాబాద్ ప్రజలు మళ్లీ గెలిపిస్తారని పదే పదే చెబుతున్నారు కదా? అదే నిజమైతే ఎం దుకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావడం లేదో చెప్పాలన్నారు. ఇన్నాళ్లూ కేసీఆర్ బొమ్మ పై గెలిచావని తమతోపాటు ప్రజలంటున్నారని, ఆయన మాత్రం సొంతంగా గెలిచినట్లు భావిస్తున్నారని, అదే నిజమైతే.. ఆయనకు అంత విశ్వాసమే ఉంటే ఇప్పుడు రాజీనామా చేసి గెలువొచ్చు కదా? అలా ఎందుకు చేయడం లేదు? బర్తరఫ్ చేసినా ఇంకా పదవిని పట్టుకొని ఎందుకు పాకులాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోగా.. పదవిని పట్టుకొని పాకులాడడాన్ని ఆత్మాభిమానం అంటారా? లేదా ఆత్మవంచన అంటారా? చెప్పాలన్నారు.
నిరూపిస్తే ఐదు రెట్లు టాక్స్ కడుతాం
గ్రానైట్తో జిల్లాను బొందలగడ్డగా మార్చామని, టాక్సు ఎగ్గొట్టామని, సరైన సమయంలో బయట పెడుతామని చెప్పడమే కాదు.. బిడ్డా.. ఖబడ్దార్ అంటూ తనపై వ్యక్తిగత విమర్శలకు ఈటల దిగారని, అయితే.. టాక్స్ ఎగవేసినట్లుగా నిరూపిస్తే దానికి ఐదింతలు చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. వివిధ హోదాల్లో ఆయన మంత్రిగా పని చేశారని, చివరకు ఆర్థిక మంత్రిగా పని చేశారని, మరి టాక్స్లు ఎగ్గొడితే ఎందుకు ప్రశ్నించలేదో? నోటీసులు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ వ్యవహారంలో సీబీఐతో విచారణ చేయించినా తాము సిద్ధంగా ఉన్నామని, ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. ఇక బొంద ల గడ్డగా మార్చారంటూ విమర్శలు చేసిన దానిపై ఘాటుగా స్పందించారు. 350క్వారీలు నడుస్తుం టే అందులో గంగులది ఒక గ్రానైట్ క్వారీ మాత్రమేనని చెప్పారు. “ఒకప్పుడు కమలాపూర్, ఇప్పు డు హుజూరాబాద్ నియోజవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా? ఆయన పరిధి లో 2004నుంచి నేటి వరకు అనేక మంది క్వారీ లు నడుస్తున్నాయి కదా? తమిళనాడు నుంచి వచ్చి చేస్తుంటే.. ఇన్నాళ్లుగా ఎందుకు ప్రశ్నించలేదు? మీ ప్రాంతం బొందల గడ్డగా మారుతుందని మీరు భావిస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఎందుకు ఆపలేకపోయారు? కనీసం అధికారులకో లేదా సంబంధిత శాఖలకో ఏనాడైనా ఒక లేఖైనా రాశారా? లేక వారితో మీరు కమ్ముక్కు ఆయ్యారా? ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి” అని డిమాండ్ చేశారు. రాజకీయాలకు రాకముందు నుంచే తమ కుటుంబానికి గ్రానైట్ వ్యాపారంతో సంబంధం ఉందన్నారు. అవసరం అయినప్పుడు బయట పెట్టడం కాదని, దమ్ముంటే ఇప్పుడే వెల్లడి చేయాలని, ఆధారాలు ఉంటే వాటిని దాచిపెట్టడం ఎందుకు ? అని ప్రశ్నించారు. లేకపోతే తప్పుడు ఆరోపణలు అని ఒప్పుకోవాలన్నారు.
బెదిరిస్తున్నది ఎవరు?
ఈటల వ్యవహార శైలి నచ్చక టీఆర్ఎస్ శ్రేణు లు పార్టీ వెంటే ఉంటామని, సీఎం నాయకత్వంలోనే పని చేస్తామని తరలివస్తున్నారని, ఇది చూసి జీర్ణించుకోలేక.. సహనం కోల్పోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి గంగుల మండిపడ్డా రు. తాము బెదిరిస్తున్నామని చెబుతున్నారు కదా ? ఎవరిని బెదిరించామో వెల్లడించాలన్నారు. ‘పార్టీ వెంట వెళ్లవద్దు.. నీకే మద్దతు ఇవ్వాలని ఆఫర్లు ఇస్తున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు. సీనియర్ నేతగా ఇన్నాళ్లూ గౌరవం ఇస్తూ వచ్చామని, కానీ.. ఆయనే వ్యక్తిగత విమర్శలకు అంకురార్పణ చేశారని మండిపడ్డారు. అయినా, తాము సహనంతో ఉన్నామని, ఇక ముందు నిరాధార ఆరోపణలు చేసినా.. బెదిరింపులకు పాల్పడినా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మేయర్ సునీల్రావు, గ్రంథాలయ జిల్లా చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ఆనందరావు, శ్యాంసుందర్రెడ్డి, నేతలు చల్లా హరిశంకర్, పురమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.