TS Rain Alert | తెలంగాణలో రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. సోమవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరితో పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్డీపీఎస్ వివరించింది.